Rangareddy Road Accident: చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఢీకొన్న ధాటికి బస్సుపై కంకర లోడు పడిపోయింది. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రాఫిక్కు అంతరాయంఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్లోని స్కూల్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు తిరిగి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా హైదరాబాద్- బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల- వికారాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాల పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. కంకర లోడుతో ఉన్న టిప్పర్ రోడ్డు రాంగ్ రూట్లో వచ్చి బస్సు ను ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. హుటాహుటిన ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి బస్సు మీద లారీ పడటంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. పోలీసులు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టి బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు.