Andhra Pradesh Crime News: మంచం కింద జిలెటిన్ స్టిక్‌ పేల్చి వ్యక్తి దారుణ హత్య కడప జిల్లాలో కలకలం రేపింది. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రించే టైంలో ప్రత్యర్థులు హత్య చేశారు. ఆయన పడుకున్న మంచ కింద డిటోనేటర్లు పెట్టి పేల్చేశారు. 


అదే మంచంపై నిద్రిస్తున్న నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీనికి వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 


ఈ హత్యకు బాబు అనే వ్యక్తి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నామని పులివెందుల డిఎస్పీ వెల్లడించారు. 


నరసింహ ఇంటికి సమీపంలో ఉన్న రమేష్ ఇంటి వద్ద నుంచి బ్యాటరీ గన్ ద్వారా జిలెటిన్ స్టిక్ అమర్చిన డిటోనేటర్‌ను మంచం కింద పడేలా షూట్ చేశారు. ఈ దుర్ఘటనలో నరసింహ ఆయన భార్యకు తీవ్ర గాయలు అయ్యాయి. చికిత్సకు తరలిస్తుంటే నరసింహ మార్గ మధ్యలోనే చనిపోయాడు. 


హత్య చేయడానికి ఉపయోగించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడ లభించాయని ఎవరి వద్ద కొనుగోలు చేశారన్న విషయంపై కూడా దర్యాప్తు సాగుతోంది. బైరటీస్ గనుల్లో పని చేస్తున్న బాబు అక్కడి నుంచే వాటిని తీసుకొని వచ్చే అవకాశం ఉందంటన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా పోలీసులు భావిస్తున్నారు. ఇలా విచ్చలవడిగా ఎవరికి వాళ్లు తీసుకనేందుకు ఎలా వీలుపడుతుందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. పేలుడు పదార్థాలు ఎక్కడ లభించాయో తెలుసుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.