Techie Shot Dead in Hotel: పుణేలోని ఓ హోటల్‌లో దారుణ హత్య జరిగింది. గర్ల్‌ఫ్రెండ్‌ని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఓయో హోటల్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు వందన ద్వివేది ఓ బడా ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసేది. నిందితుడు రిషబ్ యూపీలోని లక్నోలో ఉండే వాడు. దాదాపు పదేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. రిషబ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు తరచూ పుణేకి వచ్చే వాడు. ఈసారి కూడా అలాగే కలిసేందుకు వచ్చాడు. ఇద్దరు కలిసి హింజవడి ప్రాంతంలోని ఓయో హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. జనవరి 25వ తేదీ నుంచి అదే హోటల్‌లో ఉంటున్నారు. ఆ సమయంలోనే వందనను చంపేందుకు ప్లాన్ చేశాడు రిషబ్. ఆమె క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని రూమ్‌ బుక్ చేశాడు. జనవరి 27న రాత్రి గన్‌తో ఆమెని కాల్చి చంపాడు. ఆ తరవాత రాత్రి 10 గంటల సమయంలో హోటల్ గదిలో నుంచి బయటకు వచ్చాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హత్య చేసిన తరవాత అక్కడి నుంచి ముంబయి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్ గదిని సీల్ చేశారు. వందన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వందనను చంపేందుకు గన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.