Pune techie leaves meeting midway jumps from office building: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మానసిక స్థితి దారుణంగా ఉంటోంది.  పూణెలోని హింజవాడి ఐటీ పార్క్‌లో దారుణ ఘటనే దీనికి ఉదాహరణగా మారింది.  23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పీయూష్ అశోక్ కవాడే తన ఆఫీసు భవనం ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గత ఏడాది జులై నుంచి అట్లాస్ కోప్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. నాసిక్‌కు చెందిన పీయూష్, పూణేలోని వాకడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. 

ఎప్పట్లాగే ఆఫీసుకు వచ్చిన అశోక్ .. సాధారణ ఆఫీసు మీటింగ్‌లో ఉండగా  ఛాతీలో నొప్పి అనిపించిందని చెప్పి హఠాత్తుగా గది నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య, భవనం టెర్రస్ నుంచి దూకి తన జీవితాన్ని ముగించాడు. ఘటనా స్థలంలో చేతితో రాసిన సూసైడ్ నోట్ లభించింది. ఇందులో అతను తన కుటుంబానికి క్షమాపణ చెప్పాడు. “నేను జీవితంలో అన్ని చోట్లా విఫలమయ్యాను. నన్ను క్షమించండి,” అని రాసి, తన తండ్రికి కూడా క్షమాపణ చెప్పాడు, తాను ఆయన కొడుకుగా ఉండడానికి అర్హుడిని కాదని పేర్కొన్నాడు. 

సూసైడ్ నోట్ ను బట్టి.. కుటుంబ సమస్యలని అనుకుంటున్నారు.  లీసులు ఈ కేసును యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం, సహోద్యోగులను ఇంటర్వ్యూ చేయడం వంటి చర్యల ద్వారా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఒత్తిడులు ఈ ఘటనకు కారణమయ్యాయా అనే కోణాలను అన్వేషిస్తున్నారు. ప్రాథమిక విచారణలో పని ఒత్తిడితో నేరుగా సంబంధం లేదని  చెబుతున్నారు. కానీ విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోనున్నారు.

ఈ ఘటన సహోద్యోగులు, స్నేహితులు మరియు స్థానిక సమాజంలో షాక్‌ను కలిగించింది. ఐటీ రంగంలో ఒత్తిడితో కూడిన వాతావరణంలో యువ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సవాళ్ల గురించి చర్చలు రేకెత్తించింది. 2025 జూన్‌లో హింజవాడిలో జరిగిన మరో ఇలాంటి ఘటనలో, 25 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ అభిలాష భౌసాహెబ్ కోథింభైర్ కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ప్రాంతంలోని ఐటీ హబ్‌లో మానసిక ఆరోగ్య సమస్యలపై ఆందోళనలను మరింత పెంచింది.                                    

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.