Girl Deadbody Not Found In Machumarri: నంద్యాల (Nandyal) జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రిలో బాలికపై అత్యాచార ఘటనలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. గత 4 రోజులుగా మైనర్ మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా గుర్తించలేకపోయారు. ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే, బాలికపై దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, వారు పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కాలువలో పడేశామని నిందితులు చెప్పగా.. పోలీసులు మత్స్యకారులు, గత ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఎంత జల్లెడ పట్టినా ఫలితం లేకపోవడంతో నిందితులను మరోసారి రహస్య ప్రదేశంలో విచారించారు. రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని శ్మశానంలో పడేశామని చెప్పగా.. మచ్చుమర్రితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని శ్మశాన వాటికల్లోనూ గాలింపు చేపట్టారు. తాజాగా, బాలిక మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని చెప్పగా.. ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నారు. మైనర్ బాలురుతో సహా వారి తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. 


డీఐజీ స్థాయి అధికారి కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ఇప్పటివరకూ బాలిక మృతదేహం లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ మృతదేహాన్నైనా తమకు అప్పగించాలని కన్నీటితో వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలికపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం గ్రామంలో వీఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలిక మృతదేహం త్వరగా కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇదీ జరిగింది


నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి గత ఆదివారం వీధుల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు బాలికను ఆడుకుందామని మాయమాటలు చెప్పి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. వీరి అఘాయిత్యాన్ని భరించలేక బాలిక మృతి చెందగా భయంతో మృతదేహాన్ని ఎత్తిపోతల ప్రాజెక్ట్ దగ్గర కాలువలో పడేశారు. బాలిక ఆచూకీ తెలియక ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వారు డాగ్ స్క్వాడ్ బృందాలతో పాప కోసం గాలించారు. ఘటనా స్థలంలో ఆధారాలతో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలికపై అత్యాచారం చేసి చంపేశామని నిందితులు పోలీసు విచారణలో అంగీకరించగా.. వారు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కాలువలో తీవ్రంగా గాలించినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. ఇప్పుడు కృష్ణా నదిలో సైతం గాలింపు చేపడుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. 


మరో ఘటన..


అటు, ఈ ఘటన మరువక ముందే విజయనగరం జిల్లాలో మరో దారుణం జరిగింది. ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై తాత వరుసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రామభద్రాపురం మండలంలో ఈ ఘోరం జరిగింది. చిన్నారిపై దారుణాన్ని గుర్తించిన తల్లి, గ్రామస్థులు నిందితున్ని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం జరగ్గా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Crime News: ఏపీలో ఘోరం - ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై అత్యాచారం