Robbery Money Found In Banyan Tree In Prakasam: మర్రిచెట్టు తొర్రలో రూ.66 లక్షల నగదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఓ ఏటీఎం వ్యానులో నగదు చోరీ చేసిన దొంగలు ఎక్కడ దాచాలో తెలియక చెట్టు తొర్రలో సొమ్ము దాచారు. నిందితులను గుర్తించిన పోలీసులు నగదు రికవరీ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న ఒంగోలులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర చోరీ జరిగింది. ఒంగోలు - కర్నూల్ రోడ్డులోని ఓ పెట్రోల్ బంకు ఆవరణలో ఏటీఎంల్లో నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీకి చెందిన వ్యాన్ వచ్చి ఆగింది. ఈ వాహనంలో రూ.68 లక్షల నగదు ఉండగా.. సిబ్బంది మధ్యాహ్నం సమయం కావడంతో భోజనం చేసేందుకు వెళ్లారు. వారు తిరిగి వచ్చి చూసే సరికి వ్యానులో నగదు మాయమైంది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై సీఎంఎస్ ఏజెన్సీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. వాహనం నుంచి సుమారు రూ.66 లక్షల నగదు దోపిడీకి గురైనట్లు సంస్థ లోకల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాన్ డోర్ మధ్యలో ఉన్న హోల్ లో నుంచి చెయ్యి పెట్టి లాక్ ఓపెన్ చేసిన దుండగులు.. అక్కడే బ్యాగులో ఉన్న రూ.66 లక్షలు దోచుకుని వెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


సీఎంఎస్ ఉద్యోగులే నిందితులు


సీఎంఎస్ ఉద్యోగులే నగదు చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒంగోలు సీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ కొండారెడ్డి, సీఎంఎస్ మాజీ ఉద్యోగి మహేష్ బాబు, రాచర్ల రాజశేఖర్ నిందితులుగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ముందుగా మహేష్ బాబును గుర్తించి పట్టుకోగా.. అతన్ని విచారించగా.. అసలు విషయం తెలిసిందని పోలీసులు తెలిపారు. చోరీ సొమ్మును మర్రిచెట్టు తొర్రలో దాచారని.. ఆ డబ్బు రికవరీ చేసినట్లు ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ అనిల్ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.


Also Read: YS Sharmila: ఇదేనా వైఎస్ఆర్ వారసత్వం? వైసీపీకి ఓటేస్తే బూడిదలోపోసిన పన్నీరే - షర్మిల