Madanapalle kidney racket case update:  అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెద్ద ఎత్తున అక్రమ కిడ్నీ మార్పిడి ముఠా చిన్నది కాదని.. చాలా పెద్ద స్థాయిలో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  విశాఖపట్నం మధురవాడకు చెందిన 29 ఏళ్ల యమున   కిడ్నీ డొనర్‌గా ఒప్పుకుని గ్లోబల్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకున్న సమయంలో మరణించడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా SBI కాలనీలో నడుస్తున్న ఈ ఆస్పత్రిని ఆరోగ్యశాఖ అధికారులు మూసివేశారు. పోలీసులు ఏడుగుర్ని  అరెస్ట్ చేశారు.  లక్షలాది రూపాయల లావాదేవీలు, మత్తు మందులు ఇచ్చి డొనర్లను మోసం చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ముఠా తెలుగు రాష్ట్రాలకు విస్తరించినట్టు తేలడంతో, పోలీసు టీమ్‌లు విశాఖ, చిత్తూరు ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి డయాలిసిస్ ఇన్‌చార్జ్ డాక్టర్ బాలరంగడు ,  పుంగనూరు డయాలిసిస్ సెంటర్ ఇన్‌చార్జ్ బాలాజీ నాయక్ ఈ ముఠాకి మాస్టర్ మైండ్స్‌గా మారారు. వీరు డయాలిసిస్ కోసం వచ్చే ధనిక రోగులను గుర్తించి, " కిడ్నీ ఏర్పాటు చేస్తాం, కానీ డబ్బు ఖర్చు అవుతుంది" అని ఒప్పందాలు కుదుర్చుకునేవారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన బ్రోకర్లు పెల్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేశ్‌లతో చేతులు కలిపారు. వీరు పేదలను , ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని కిడ్నీ డొనర్లుగా డబ్బులు ఆశపెట్టి అంగీకరింపచేసేవారు. 

Continues below advertisement

గ్లోబల్ హాస్పిటల్‌లో డాక్టర్ అవినాష్ , డాక్టర్ శశ్వతి, మధ్యవర్తి నీరజ్ ఈ రాకెట్‌ను కొన్ని నెలలుగా రహస్యంగా నడుపుతున్నారు. ఆస్పత్రి ప్రభుత్వ అనుమతి లేకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లు చేస్తూ, లక్షల రూపాయల లావాదేవీలు జరుపుతున్నట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు డీసీహెచ్‌ఎస్ అధికారి కావడంతో, ప్రభావాన్ని ఉపయోగించి అనుమతులు అవసరం లేకుండా చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి, గోవా, తమిళనాడు వంటి ప్రాంతాలకు కూడా ముడిపడి ఉందని పోలీసులకు సమాచారం లభిస్తోంది.  

నవంబర్ 10 సోమవారం యమునను విశాఖ నుంచి మదనపల్లెకు తీసుకువచ్చి, గ్లోబల్ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశారు. ఆమె కిడ్నీని గోవాకు చెందిన రంజన్‌నాయక్ కు ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని ప్లాన్. కానీ, ఆపరేషన్ సమయంలో  స్ట్రోక్  వచ్చి యమున మరణించింది. ఆస్పత్రి మేనేజ్‌మెంట్ మృతిని దాచిపెట్టేందుకు శవాన్ని రహస్యంగా విశాఖకు తరలించాలని ప్రయత్నించింది. భర్తకు అనుమానం వచ్చి, 112 ఎమర్జెన్సీకి కాల్ చేశాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్ ద్వారా మొబైల్ లొకేషన్ గుర్తించి, పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.

Continues below advertisement

యమున తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని, శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం చేయించారు. మదనపల్లె టూ టౌన్ సీఐ రాజా రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ అవినాష్, డాక్టర్ శశ్వతి, నీరజ్‌లను అరెస్ట్ చేశారు.    మంగళవారం రాత్రి మరో ఇద్దరు బ్రోకర్లను డిటేన్ చేశారు. పోలీసులు విశాఖ మధురవాడ, చిత్తూరు ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహిస్తూ, మత్తు మందులు  ఆధారాలు సేకరిస్తున్నారు. ముఠా కోట్ల రూపాయల టర్నోవర్ చేసినట్టు ఆధారాలు లభిస్తున్నాయి.