Warangal Murder: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకు సాయి ప్రకాష్ హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీస్ లు చేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుపడడంతో పాటు ఉద్యోగం నుండి సస్పెండ్‌ చేయించాడు అనే ఆక్రోషంతో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ సాయి ప్రకాష్ హత్య చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ తోపాటు అతను అక్రమ సంబంధం కొనసాగిస్తున్న నిర్మల, డేవిలీ సాయి, ఆలోత్‌ అరుణ్‌కుమార్‌, అఖిల్‌ నాయక్‌, రాజు నిందితులను అరెస్ట్ చేసి ఒక కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఎయిర్‌ పిస్తోల్‌ల ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. 

పక్కా ప్లాన్ తో సాయి ప్రకాష్ హత్య.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తుండడంతో పాటు ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించాడనే కోపంతో సాయి ప్రకాష్ హత్య కు ప్లాన్ వేసాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. ఈ నెల 15 వ తేదిన కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్రమ సంబందం కొనసాగిస్తున్న నిందితురాలు నిర్మల మామ ఆరోగ్య పరీక్షల కోసం ఆమె భర్తతో పాటు, సాయి ప్రకాశ్‌ తో కలిసి హన్మకొండ కు కారులో వచ్చారు. సాయి ప్రకాష్ హన్మకొండకు వచ్చిన విషయాన్ని నిర్మల ప్రియుడు శ్రీనివాస్‌ కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే నిర్మల మామ వైద్య పరీక్షల అంతరం తిరిగి నిర్మల మామ, భర్త వెంకటాపూర్ కు వెళ్ళారు. సాయి ప్రకాష్ మాత్రం ములుగు జిల్లా వెంకటాపుర్ కు వెళ్లకుండా హన్మకొండ లోని స్నేహితుని రూంకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే పక్కా ప్లాన్ తో ఉన్న శ్రీనివాస్ ఇదే అదునుగా భావించి మిగితా నిందితులతో కలిసి అదే రోజు రాత్రి మృతుడు సాయి ప్రకాశ్‌ ఒంటరి గా కారులో వెళ్తుండగా ఆటో శ్రీనివాస్ పాటు మరో ముగ్గురు కారును వెంబడిస్తూ సుమారు రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో హన్మకొండ గోపాల్‌పూర్‌ క్రాస్‌ రొడ్‌ వద్ద  నిందితులు సాయి ప్రకాష్ కారును అడ్డగించి అందులో ఎక్కి  మృతుడు సాయి ప్రకాశ్‌ ను తీవ్రం కొట్టుకుంటూ హసన్‌పర్తి శివారు ప్రాంతంకు వెళ్ళారు. కారు ఆపి మృతుడు సాయి ప్రకాశ్‌ను నిందితులు శాలువతో గొంతుని బిగించి దారుణంగా హత్య చేసినట్లు చేశారు. 

హత్య అనంతరం నిందితులు మృతుడి కారులోనే హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జిల్లెడు గడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావిలో మృతుడి మృతదేహాన్ని పడవేసి తిరిగి వేలేరు మీదుగా హన్మకొండ బస్టాండ్ సమీపంలోని మాల్‌ ప్రాంతంలో కార్‌ ను పార్క్‌ చేసి నిందితులు పరార్ అయ్యారు. 

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య 

ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ 2009 లో హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై పరస్పర బదిలీల్లో  హన్మకొండ బదిలీ అయ్యాడు. కొద్ది రోజులకు 317 జి.ఓ ప్రకారం శ్రీనివాస్‌ ములుగు జిల్లాకు వాజేడ్‌ వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌ బదిలీ అయ్యాడు. వెంకటాపురం కు చెందిన  నిర్మలతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఆక్రమ సంబంధంగా మారింది. అయితే నిందితురాలు నిర్మల  హత్యకు గురైన సాయి ప్రకాష్ కు వరుసకు పిన్ని అవుతుంది. అయితే నిర్మల అక్రమ సంబంధాన్ని ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు సాయి ప్రకాష్ చెప్పాడు. దీంతో నిర్మల భర్త, బంధువులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ వ్యవహరంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్‌ అధికారులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేశారు. కొద్ది నెలల అనంతరం శ్రీనివాస్‌ తిరిగి గత ఏడాది డిసెంబర్‌లో విధుల్లో చేరాడు. పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్‌ కారణమైన మృతుడి సాయి ప్రకాశ్‌ పై కక్ష్య పెంచుకొని అవకాశం చూస్తున్న శ్రీనివాస్ చివరకు నిర్మల సహాయంతో సాయి ప్రకాష్ ను హత్య చేశారు.

సాయి ప్రకాష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో వీడిన మిస్టరీ.

ఈ నెల 15 వ తేదీన రాత్రి సాయి ప్రకాష్ హత్య గురయ్యాడు. సాయి ప్రకాష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో బందువుల ఇళ్ళలో ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో 17 వ తేదీన సాయి ప్రకాష్ అదృష్యమైనట్లు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు కానిస్టేబుల్ శ్రీనివాస్ పై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు. శ్రీనివాస్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న నిర్మల ను అదుపులోకి తీసుకొని విచారించగా సాయి ప్రకాష్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు. మృతుడు సాయి ప్రకాష్ చేయూత స్వచ్ఛంద నిర్వాహకుడిగా ములుగు జిల్లా ప్రాంతంలో సుపరిచితుడు. ములుగు ఏజెన్సీ లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ  అండగా నిలిచాడు. అయితే సాయి ప్రకాష్ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూనే స్వంత కారుతో టాక్సీ నడుపుతున్నాడు.