కొందరు దొంగలు ఎంతో చాక చక్యంగా దొంగతనం చేస్తారు. పక్కా ప్లానింగ్ రూపొందిస్తారు. పకడ్బందీ వ్యూహంతో చోరీకి పాల్పడతారు. కానీ వారు చేసే చిన్న పొరపాటు, విడిచి పెట్టే చిన్న క్లూ వారిని పట్టిస్తుంది. నేర్పుగా దొంగతనం చేశామని సంతోషంగా ఉండగా.. హ్యాండ్సప్  అంటూ పోలీసులు దిగిపోతారు. అచ్చం అలాంటి ఘటనే జరిగింది రాజస్థాన్ లో జరిగింది. దిల్లీ పోలీసులు ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. 


అసలేం జరిగింది..?


అది దిల్లీ. ఇద్దరు వ్యక్తులు ఓ జ్యూవెలరీలో పని చేస్తుంటారు. వారి పనిలో భాగంగా.. బంగారు నగలు, వెండి నగలు, వజ్రాలు ఉన్న పార్శిల్ పట్టుకుని వెళ్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో డీబీజీ రోడ్డు వైపునకు వెళ్తున్నారు. మిలీనియం హోటల్ వద్దకు రాగానే వారికి ఓ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అందులో ఒక వ్యక్తి పోలీసులు యూనిఫాం వేసుకున్నాడు. నగల పార్శిల్ పట్టుకుని వెళ్తున్న ఆ ఇద్దరిని వారు ఆపారు. వారితో మాట్లాడుతుండగానే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా యూనిఫాం వేసుకున్న వ్యక్తి, తనతోపాటు వారి కళ్లల్లో కారం చల్లారు. వారి చేతిలో ఉన్న పార్శిల్ బ్యాగును ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. వారి భయపడి నగలు ఉన్న పార్శిల్ బ్యాగును వారికి ఇచ్చారు. వెంటనే ఆ నలుగురు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. 


700 సీసీటీవీ కెమెరాలతో అన్వేషణ..!


దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే పలు బృందాలు ఏర్పాటు చేసి దొంగల గురించి వెతకడం ప్రారంభించారు. లూటీకి సంబంధించిన దృశ్యాలు దగ్గర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. రోజులు గడుస్తున్నాయి. కానీ దొంగలకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. అప్పటికే 7 రోజులు అయ్యాయి. దాదాపు 700 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. ఒక ఫుటేజీలో నిందితులను గుర్తించారు పోలీసులు. వారు ఒక క్యాబ్ దగ్గర కాసేపు ఉన్నట్లు గమనించారు. ఆ క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని ప్రశ్నించారు. వాళ్లు టీ తాగడం కోసం తనకు పేటీఎం ద్వారా రూ. 100 పంపించారని.. వారికి తను రూ. 100 నగదు ఇచ్చానని ఆ క్యాబ్ డ్రైవర్ పోలీసులు చెప్పాడు. 


పట్టించిన పేటీఎం లావాదేవీ..!


పేటీఎం నుంచి నిందితులు పంపించిన ట్రాన్సాక్షన్ ను విశ్లేషించడం ప్రారంభించారు పోలీసులు. అది ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉందో తెలుసుకున్నారు. ఆ బ్యాంకు ఖాతా తీసుకునే సమయంలో ఇచ్చిన అడ్రస్, ఫోన్ నంబరు, ఆ ఖాతాతో లింకు అయిన ఉన్న ఆధార్ కార్డు వివరాలు సేకరించారు. వారంత రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లిన నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 6,270 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, 500 గ్రాముల గోల్డ్ డిపాజిట్లు, 106 ముడి వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.