Parvatipuram Crime News :  మా నాన్న ఎలా చనిపోయాడో మీవాడు కూడా అలానే చావాలి. లేకపోతే మీ ఇంట్లోని అందర్నీ చంపేస్తామంటూ ఒక కుటుంబం మరో కుటుంబాన్ని బెదిరించారు. ఏం చేయాలో తెలియక పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. వ్యవహారం మొత్తం విన్న పెద్దమనుషులు 'ప్రాణానికి ప్రాణమే' న్యాయమంటూ తీర్పు చెప్పేశారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించి వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి వెల్లడించారు.



పెళ్లిలో గొడవ 


పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం రేగులగూడలో మే 27న ఓ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో గ్రామానికి చెందిన సవర గయా(60) కుమార్తె పద్మను ఉసిరికిపాడుకు చెందిన మతిస్థిమితం లేని సవర సింగన్న(33) కర్రతో కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గయా వచ్చి సింగన్నను కిందకు తోసేశాడు. దీంతో మతి స్థిమితం లేని సింగన్న కోపంతో గయాపై కర్రతో దాడిచేశాడు. దీంతో గయా అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాతి రోజు గయా కుమారులు, స్థానికులు సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అంతా వచ్చాక పంచాయతీ నిర్వహించి, తమ తండ్రి ఎలా చనిపోయాడో సింగన్న కూడా అలాగే చావాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందర్నీ చంపేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు పెద్దలను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న పెద్దలు ప్రాణానికి ప్రాణం ఇవ్వాలన్న తీర్పు చెప్పారు. 



16 మందిపై కేసులు


కుటుంబంలో అందరి ప్రాణాలు తీస్తారని భయపడిన సింగన్న కుటుంబసభ్యులు పెద్దలు చెప్పిన తీర్పు అమలుకు అంగీకరించారు. ఈ నెల 28న సింగన్నకు విషమిచ్చారు. మరణించలేదని ఉరేశారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని కాల్చేశారు. గయా, సింగన్న మరణాలు సాధారణమైనవని మొదట భావించినా గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారు. పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో మిస్టరీని ఛేదించిన పోలీసులు హత్యలకు  ప్రేరేపించినవారు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు సహా ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశారు. పాలకొండ సీఐ జి.శంకరరావు, దోనుబాయి, బత్తిలి, పాలకొండ ఎస్సైలు కిశోర్‌వర్మ, డి.అనిల్‌కుమార్‌, ప్రసాద్‌ ఆయా ప్రాంతాలకు వెళ్లి వివరాలు సేకరించారు. రెండూ హత్యలుగా తేలినట్లు పేర్కాన్నారు. హత్యలకు కారకులు, ప్రేరేపించినవారు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.