Social Media Love : సోషల్ మీడియా పరిచయాలు ప్రేమగా మారడం ప్రియుడి కోసం అమ్మాయిలు ఇంటి నుంచి వెళ్లిపోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. పల్నాడు జిల్లాలో ప్రియురాలి కోసం ప్రియుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కొడుకు కనిపించడంలేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.


అసలేం జరిగింది? 


పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శివనాగరాజు కొరియర్ బాయ్ గా పనిచేసేవాడు. తర్వాత ఉద్యోగం మానేసి తండ్రి వీరాంజనేయులుకు సాయంగా ఉంటున్నాడు. శివనాగరాజుకు ఫేస్ బుక్ ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏడాది క్రితం తన ప్రేమ వ్యవహారం గురించి తల్లిదండ్రులకు చెప్పాడు శివనాగరాజు. ప్రేమ గీమా వద్దని‌ తల్లిదండ్రులు కొడుకు శివనాగరాజుకు తేల్చిచెప్పారు. అప్పటినుంచి శివనాగరాజు సైలెంట్ అయ్యాడు. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా ప్రియురాలితో మాట్లాడుతున్నాడు.


పెళ్లి ప్రపోజల్ తో 


శివనాగరాజుకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భావించిన శివనాగరాజు పదిరోజుల క్రితం ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. తన సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టాడు. కొడుకు ఆచూకీ కోసం గాలించిన తల్లిదండ్రులు చివరకు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ లో శివనాగరాజు ప్రేమించిన యువతి వివరాలపై విచారణ మొదలుపెట్టారు. అయితే ఫేక్ ప్రొఫైల్, ఫొటోలతో శివనాగరాజును యువతి మోసం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇళ్లు ధ్వంసం 


ప్రేమ పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు.  తిరుపతి‌ జిల్లా చంద్రగిరిలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. తిరుపతి‌ జిల్లా బుచ్చినాయుడు పల్లి పంచాయతీలో మోహన్ రెడ్డి కాలనీకి చెందిన మోహనకృష్ణ గుంటూరుకు చెందిన డాక్టర్ సుష్మాను రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సుష్మా మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి మోహన్ రెడ్డి కాలనీలో ఉంటుంది. కుమార్తె ప్రేమ వివాహాన్ని అంగీకరించని  కుటుంబ సభ్యులు, తమ స్నేహితులు, బంధువుల ముందు పరువు పోయిందనే కారణంతో మోహన్ కృష్ణను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. కానీ అవేవి పట్టించుకోకుండా సుష్మా, మోహన్ కృష్ణలు వైద్య వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు సుష్మాను తీసుకెళ్లేందుకు రెండు నెలల పాటు వివిధ రకాలుగా ప్రయత్నించారు. సుష్మా అంగీకరించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సుమారు 30 మందితో గురువారం అర్ధరాత్రి మోహనకృష్ణ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు, టీవీ, ఫర్నిచర్, తలుపులు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. గదిలో ఉన్న సుష్మాను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు.