Student suicide in Basara IIIT: బాసర ఆర్జీయూకేటీలో మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా దవ్వురు గ్రామానికి చెందిన తెనుగు శిరీష(18) గురువారం రాత్రి హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది తెలిపారు. చదువుల తల్లి క్షేత్రంలో నెలకొన్న బాసర ట్రిపుల్ ఐటీలో ఎప్పుడూ ఏదో ఒక కారణం వలన విద్యార్థుల బలిదానాలు మాత్రం ఆగడం లేదు. ఆత్మహత్య చేసుకున్న శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. శిరీష నిన్ననే ఇంటి నుంచి ట్రిపుల్ ఐటీకి వచ్చింది. బావ మరణించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గుర్తించారు. అమ్మానాన్నలకు సారీ చెబుతూ సూసైడ్ నోట్ రాసింది. 


అయితే ఆమె రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తుంది. ‘‘బావ లేకుండా నేను ఉండలేను నా బతుకు శూన్యం, నన్ను క్షమించండి నాన్న నేను బావ దగ్గరకు వెళ్తున్నాను నాన్న నేనంటే ఇష్టం కదా నీకు.. బావను కాల్చిన స్థలంలోనే నన్ను కాల్చి నా చివరి కోరిక తీర్చండి అప్పుడే బావ ఆత్మకు శాంతి కలుగుతుంది’’ అంటూ వేడుకుంది. బావ చావుకి కారణమైన వాళ్ళని వదలకండి అని సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ఈ విషయమై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిరీష మృతి పట్ల ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ మరియు సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. శుక్రవారం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పంగించారు. తల్లిదండ్రులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.