Newly Married Groom Died Due To Heart Attack In Tirumala: వారికి పెళ్లై 15 రోజులే అయ్యింది. కొత్త ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు (Tirumala) చేరుకున్నారు. కాలినడకన వెంకటేశుని దర్శనం కోసం దంపతులిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల మార్గంలో వెళ్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవ వరుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ అనే వ్యక్తి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 15 రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చారు. శుక్రవారం కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరారు.


కుప్పకూలిన వరుడు


ఈ క్రమంలోనే 2,350 మెట్టు వద్దకు రాగానే నవీన్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు నవీన్‌ను అంబులెన్సులో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, నవీన్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నవీన్‌ది తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతం. ఉద్యోగ రీత్యా ఆయన బెంగుళూరులో స్థిరపడ్డారు.


Also Read: Tirumala News: తిరుమల టికెట్లు ఇలా బుక్ చేసుకుంటున్నారా? అదొక స్కామ్! టీటీడీ హెచ్చరిక