Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు ఆనో లైన్ విధానం ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. కొందరు సొంతంగా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుంటే మరికొందరు ఇంటర్ నెట్ సెంటర్ కి వెళ్లి బుక్ చేసుకుంటారు. ఇలా ఇంటర్ నెట్ సెంటర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే వారి పట్ల కొందరు మోసాలకు తెరతీసి అధిక డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇలాంటి నకిలీ టికెట్లపై టీటీడీ విజిలెన్స్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తుంది.


పాస్ పోర్టు నెంబర్ మార్చి


తిరుమలలో టీటీడీ ఆన్ లైన్ టికెట్లు కల్యాణోత్సవంలో పొందేందుకు పాస్ పోర్ట్ ద్వారా కూడా అవకాశం ఉంది. అయితే పాస్ పోర్ట్ లోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తూ... మిగిలిన నెంబర్లు కనిపించకుండా ఉంటాయి. దానిని అదనుగా చేసుకుని  ఓ నిందితుడు కళ్యాణోత్సవం టికెట్లను బుక్ చేసి భక్తులకు ఇచ్చిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు కు చెందిన ఎస్ మురళీధర్, ఎస్ మురిగేషన్ రెండు శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్ల కోసం తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు, దళారి అన్నాదురైని సంప్రదించారు. వారికి కళ్యాణోత్సవం టికెట్ల కోసం నకిలీ పాస్ పోర్ట్ నెంబర్ చివరి 4 అంకెల మాత్రం ఒరిజినల్ పాస్ పోర్ట్ నంబర్లు ఉండేలా చూసుకొని టిటిడి ఆన్ లైన్ లో టికెట్లు పొందాడు. ఆ టికెట్ తో తిరుమలకు వచ్చిన భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేసారు. తమకు అన్నాదురై అధిక డబ్బు తీసుకుని టిక్కెట్లు ఇచ్చినట్లు భక్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు పోలీసులు అప్పగించగా.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


టీటీడీ ఏమంటుంది?


టిటిడి అధికారులు నకిలీ టికెట్లను అడ్డుకట్ట వేసేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఒకే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తో అధికంగా టికెట్లు బుక్ చేసిన వారిని గుర్తించింది. దాంతో పాటు ఒకే ఆధార్ ఫోన్ నెంబర్ తో అధికంగా గదులు బుకింగ్ చేసిన వారిని చిట్టాను కూడా బయటికి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నకిలీ పాస్ పోర్ట్ నెంబర్ ద్వారా కళ్యాణోత్సవ టికెట్లు బుక్ చేసిన దళారిని గుర్తించారు.


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టిటిడి అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in
ద్వారా మాత్రమే ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్ట పోవద్దని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేస్తోంది. 


కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుత టిటిడి  యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత  దీక్షతో ఉంది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికా వద్దని టీటీడీ  తెలుపుతోంది. భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుంది. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.