Hyderabad News: సికింద్రాబాద్ లోని సింధీ కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. రాహుల్ గోయల్ అనే వ్యాపారి ఇంట్లో దుండగులు రూ. 5 కోట్ల సొత్తు చోరీ చేశారు. ఈ కేసులో తాజాగా పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. నేపాల్ కు చెందిన నేరగాళ్లు వ్యాపారి ఇంట్లో నమ్మకంగా పని చేస్తూ తన ముఠాతో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారి అపార్ట్‌మెంట్‌లో గత ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా పని చేస్తున్న నేపాల్ కు చెందిన శంకర్ మాన్ సింక్ అలియాస్ కమల్.. మరో 12 మందితో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. 41 లక్షల నగదు, 2.8 కిలోల బంగారం, 18 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మొత్తం 13 మంది కలిసి ఈ దోపిడీ చేయగా.. అందులో 9 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చేపట్టారు. ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ నేపాలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 


ఈ నెల 9న చోరీ


వ్యాపారవేత్త రాహుల్ గోయల్, అతని ముగ్గురు సోదరులు సికింద్రాబాద్ లోని పీజీ రోడ్డు సింధీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. వీరంతా ఐరన్ బిజినెస్ చేస్తున్నారు. నేపాల్ కు చెందిన కమల్ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా వారి అపార్ట్‌మెంట్‌ లోనే వాచ్‌మెన్‌ గా పని చేస్తున్నాడు. అయితే ఈ నెల 9వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండగను పురస్కరించుకుని రాహులో గోయల్ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌజ్ కు వెళ్లారు. రాహుల్ మరుసటి రోజు అంటే జులై 10వ తేదీన సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసే సరికి మెయిన్ డోర్ తాళాలు పగుల గొట్టి కనిపించాయి. వాచ్‌మెన్ కు కేకేసినా చప్పుడు లేదు. ఎంతకీ వాచ్ మెన్ కూడా రాలేదు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన రాహుల్ గోయల్.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 


ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా పని చేస్తున్న కమల్.. గోయల్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడని తెలుసుకున్నారు. చాలా కాలంగా పని చేస్తున్నందు వల్ల గోయల్ కుటుంబానికి కమల్ పై విశ్వాసం ఏర్పడింది. ఈ నమ్మకాన్నే కమల్ వాడుకున్నాడు. బోనాల సందర్భంగా కుటుంబం అంతా కలిసి ఇల్లు వదిలి వెళ్తున్నారని గుర్తించిన కమల్.. దొంగతనాలకు పాల్పడే నాప్ల్ గ్యాంగ్ కు సమాచారం అందించాడు. మొత్తం 13 మంది నేపాల్ ముఠా రెండు కార్లలో వచ్చారు. గోయల్ ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు కాజేశారు. అయితే ఈ దృశ్యాలన్నీ ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దోపిడీ అనంతరం ముందుగా బుక్ చేసుకున్న బస్సులో నేపాలీ ముఠా నగరం విడిచి పారిపోయింది. దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. నేపాల్ ముఠా కోసం తీవ్రంగా గాలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారంతా దేశ సరిహద్దులు దాటకముందే అరెస్టు చేశారు.