ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు విభాగంలో ఎస్సైగా విధుల్లో చేరిన ఓ యువ ఆర్ఎస్ఐ ప్రేమ కథ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఆ ప్రేమ కథలో అతనే విలన్ కావడం విచిత్రం. కొన్నాళ్లుగా ప్రేయసిని దూరం పెట్టిన ఆర్ఎస్ఐ.. చివరకు ఆమెపై చేయి చేసుకోవడంతో ఆమె డయల్ 100కి కాల్ చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే విచారణ అంతా రహస్యంగా సాగడం విశేషం. 


ఎవరీ ప్రేమికులు..?


ప్రేమ పేరిట వంచించాడని నెల్లూరులో పనిచేస్తున్న ఓ ఆర్‌ఎస్‌ఐపై  హైదరాబాద్ కు చెందిన యువతి నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు రోజులుగా పోలీసు అధికారులు ఈ కేసులో రహస్య విచారణ సాగిస్తున్నారు. 


నెల్లూరు జిల్లాలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఆ యువకుడు హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్ లోనే అతను కూడా కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. అప్పుడు కూడా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. ఆ తర్వాత ఆర్ఎస్ఐగా అతనికి ఉద్యోగం రావడం, పోస్టింగ్ కోసం నెల్లూరుకు వచ్చాడు యువకుడు. నెల్లూరు వచ్చిన తర్వాత కూడా వారిద్దరి ప్రేమ కొనసాగింది. నెల్లూరుకు ఆ యువతి హైదరాబాద్ నుంచి తరచూ వచ్చిపోయేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తనను ఆర్ఎస్ఐ దూరం పెడుతున్నాడని గమనించింది. దీంతో ఆమె అతనితో గొడవ పడింది. చివరకు అతను చేయి చేసుకోవడంతో వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.


గతంలోనూ ఫిర్యాదులు 


ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఆమెను కొట్టడం, ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దర్గామిట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. తర్వాత ఆమె వద్ద కంప్లయింట్ తీసుకున్నారు. అయితే నిందితుడు కూడా పోలీస్ అధికారి కావడంతో రహస్యంగా విచారణ చేపట్టారని తెలుస్తోంది. రెండు రోజులుగా రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఆ యువతి కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. అయితే ఈ విషయంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఆర్ఎస్ఐ పై గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే ఉన్నతాధికారులకు అందాయట. అప్పట్లో ఓసారి అతడిని ఉన్నతాధికారులు మందలించారని, ఇది రెండో సంఘటన అని అంటున్నారు.