NEET student suicide: హైదరాబాద్: ఎగ్జామ్ టైమ్ వచ్చిందంటే చాలు విద్యార్థులకు సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరి. ఒత్తిడిని జయించలేక విద్యార్థులు కఠిన నిర్ణయాలతో జీవితాలను కోల్పోతున్నారు. తాజాగా పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (Medchal Malkajgiri district)లోని కుత్బుల్లాపూర్‌ మండలంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.


పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో నివాసం ఉండే జైస్వాల్ (20) నీట్ ఎగ్జామ్ (NEET Exam) కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న జైస్వాల్ పరీక్ష సరిగ్గా రాస్తానో లేదోనని ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 14) తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు పేట్ బషీరాబాద్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీకి చేరుకుని పరిశీలించారు. విద్యార్థి జైస్వాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.