Lift Accident: ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువై పోయాయి. పనుల్లో నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా నిర్లక్ష్యం మాత్రం మారడం లేదు. రోజూ దేశంలో ఏదో ఒక చోట లిఫ్ట్ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. బాధితులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మొన్న గుజరాత్ లో లిఫ్ట్ కూలడంతో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం మరచిపోక ముందే ముంబయిలో మరో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ డోరులో ఇరుక్కుని ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ తాజా ఘటన ముంబయిలోని శివారు ప్రాంతం అయిన మలాడ్ చించోలి బందర్ లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్ లో ఈ ప్రమాదం జరిగింది. 


లిఫ్టు డోర్స్ మధ్యలో ఇరుక్కుపోయిన టీచర్..!


జెనెల్ ఫెర్నాండెజ్ అనే 26 ఏళ్ల టీచర్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్ కు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉంది. లిఫ్ట్ లో రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ బటన్ నొక్కగానే లిఫ్ట్ తను ఉన్న ఫ్లోర్ కు వచ్చి ఆగింది. ఎప్పట్లాగే ఆమె లిఫ్ట్ లో రెండో ఫ్లోర్ లోని స్టాఫ్ రూమ్ కు వెళ్లాలనుకుంది. కానీ అనుకోని ప్రమాదం ఆమె ప్రాణాలను తీసింది. ఆమె లిఫ్ట్ లోకి పూర్తిగా వెళ్లక ముందే లిఫ్ట్ తలుపు ఆటోమేటిక్ గా మూసి వేయబడ్డాయి. అంతలోనే లిఫ్ట్ కిందకు వెళ్లడం ప్రారంభించింది. అలా జెనెలె ఫెర్నాండెజ్ లిఫ్ట్ తలుపుల మధ్యలోనే అలాగే ఉండిపోగా.. పాఠశాల సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. పరుగెత్తుకు వచ్చి లిఫ్ఠ్ డోర్ మధ్యలో ఇరుక్కున్న జెనెలె ఫెర్నాండెజ్ ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ టీచర్ తీవ్రంగా గాయాలపాలు అయింది. 


ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయిన ఫెర్నాండెజ్..


వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జెనెల్ ఫెర్నాండెజ్ ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జెనెల్ ఫెర్నాండెజ్ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా.. లేద లిఫ్ట్ మెయింటెనెన్స్ లో పాఠశాల సిబ్బంది చూపిన నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించిందా అనే కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రాథమిక విచారణలో మాత్రం ప్రమాదం వల్లే టీచర్ ఫెర్నాండెజ్ ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. 


గుజరాత్‌ అహ్మదాబాద్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న యాస్పయిర్-2 భవంతిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ కుప్పకూలి ఏడుగురు కూలీలు మృతి చెందారు. గుజరాత్ యూనివర్శిటీకి సమీపంలో ఈ భవన నిర్మాణం సాగుతోంది. ఏడో అంతస్తు నుంచి ఈ  లిఫ్ట్ ఒకేసారి కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్ నియమ నిబంధలను బిల్టర్లు ఉల్లంఘించారా అనేది తెలుసుకుంటున్నామని.. తప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్థానిక మేయర్ పేర్కొన్నారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన దుర్ఘటన బాధాకరమని.. ఈ దుర్ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.