Telangana Crime News: కుటుంబ కలహాలు ఇద్దరు ప్రాణాలు తీశాయి. ఫ్యామిలీలో సమస్యలతో ఇబ్బంది పడ్డ ఓ ఇల్లాలు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించారు. ఈ దుర్ఘటనలో తల్లీ, కుమార్తె చనిపోగా.. కుమారుడు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరిలో జరిగిందీ దుర్ఘటన వెంకటాపురానికి చెందిన ఆకుల లావణ్య(28) ఆత్మహత్యకు యత్నించింది. తన కుమార్తె ఆకుల నిత్య(8) కుమారుడు ఆకుల ముకేష్(10)తో కలిసి బావిలో దూకేసింది. 
బావిలో దూకిన ముగ్గురిలో తల్లీ, కుమార్తె చనిపోయారు. కుమారుడు గాయాలతో బయటపడ్డారు. అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలు కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకుందని బంధువులు చెబుతున్నారు. 
స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తల్లి కూతుళ్ల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.