Mother Forceful Death With Her Children In Annamayya District: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గాలివీడు (Galiveedu) మండలం చిలుకలూరిపేటకు చెందిన నాగమణి, విక్రమ్ భార్యాభర్తలు. వీరికి నవ్యశ్రీ (10), దినేశ్ (6), జాహ్నవి (3) ముగ్గురు పిల్లలు ఉన్నారు. విక్రమ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇదే విషయమై శుక్రవారం రాత్రి భార్య నాగమణితో విక్రమ్ ఘర్షణ పడ్డాడు. దీంతో నాగమణి మనస్తాపంతో పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అనంతరం వెలిగల్లు ప్రాజెక్ట్ వద్ద ఉన్న గండిమడుగులో పిల్లలతో సహా దూకేసింది. గండిమడుగు ఒడ్డున ఉన్న చెప్పులు, సెల్ ఫోన్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు నాగమణి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


తల్లిపై కత్తితో తనయుడు దాడి


అటు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి కొడుకు కన్నతల్లిపైనే కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన సురేష్ తన కన్నతల్లిని కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకుని తల్లి తరచూ మందలించేది. ఇరువురి మధ్య తరచూ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఆస్తి పంపకాలు చేయాలని కొడుకు తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి నిరాకరించిన తల్లి నోటీసు పంపించడంతో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.


భర్తను చంపిన భార్య


నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడని తన భర్తను ఓ మహిళ తన మామ సహకారంతో దారుణంగా హతమార్చింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అప్పన్న, దేవి భార్యభర్తలు. మద్యానికి బానిసైన అప్పన్న తరచూ భార్యను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూ.. ఆమెపై వేధింపులకు పాల్పడేవాడు. శుక్రవారం ఇంటికి తాగొచ్చిన భర్తతో భార్య గొడవకు దిగింది. దీంతో గొడవ తీవ్రం కాగా ఆవేశంతో భర్తను ఉరేసి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ హత్యకు మామ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Bonda Uma: 'పోలీసులు నన్ను వేధిస్తున్నారు' - తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే న్యాయ పోరాటానికి దిగుతానన్న బొండా ఉమ