కల్లా కపటం‌ ఎరుగని హృదయం వారిది. అంతా తన వాళ్లే అనే‌ భావనలో ఉంటారు చిన్నారులు. కాని కొందరు దుర్మార్గులు తమ కామవాంఛ తీర్చుకుని బాలికల‌ జీవితాలను చిదిమేస్తున్నారు. వావి వరుసలు మరిచి పసికందుల వద్ద నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలు చేస్తున్నా, కామాంధుల‌ వెన్నులో మాత్రం ఏమాత్రం‌ వణుకు పుట్టడం‌ లేదు. తాజాగా ఇద్దరు కామాంధులు 14 ఏళ్ల బాలికపై వరుస అత్యాచారాలకు పాల్పడి గర్భవతిని చేసిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది.


పథకం ప్రకారమే మాట కలిపిన మధుసూదన రావు..!


తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప తెలిపిన వివరాల‌ మేరకు... వెంకట గిరికి చెందిన మధుసూదన రావు(26) ఆర్థిక ఇబ్బందులు కారణంగా గత కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని తన అక్క ఇంటికి వచ్చాడు. అయితే  బతుకుదెరువు కోసం మధుసూదన్ రావు పెయింటింగ్ పనులు చేస్తూ ఇక్కడే జీవించే వాడు. ఈ క్రమంలో సమీప బంధువైన 14 ఏళ్ల బాలికపై మధుసూదన్ రావు కన్ను పడింది. ఎలాగైనా ఆ 14 ఏళ్ళ బాలికను లోబరుచుకోవాలని పన్నాగం పన్నాడు. పెయింటింగ్ పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బాలికను పలకరిస్తూ, బాలికకు దగ్గర అయ్యే ప్రయత్నం చేసేవాడు.


చిరుతిళ్లు తెచ్చిస్తూ బాలికతో స్నేహం..


అంతే కాకుండా బాలికకు చిరుతిండ్లు వంటివి తీసుకుని వస్తూ, బాగా మచ్చిక చేసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయపడి మధుసూదన్ రావు వద్ద నుంచి తప్పించుకుని వెళ్ళేందుకు ప్రయత్నించింది. అయితే బాలికను పట్టుకుని భయపెట్టిన మధుసూదన్ రావు, పలుమార్లు బాలికపై అత్యచారంకు పాల్పడ్డాడు. అయితే ఇటీవల బాలిక గర్భం దాల్చిందని అనుమానం వచ్చిన‌ మధుసూదన్ రావు తిరుపతి నుంచి వెళ్ళి పోయాడు. ఆ సమయంలోనే బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళిన 14 ఏళ్ళ బాలిక తల్లి తిరిగి వచ్చింది. బాలిక శరీరంలో మార్పులు గమనించిన బాలిక తల్లి స్ధానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించింది. 


కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలింపు!


అయితే వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బాలిక ఏడు నెలలు గర్భవతి అని నిర్ధారించడంతో ఆమె తల్లి ఒక్కసారిగా షాక్ కి గురైంది. బాలిక తల్లి, గర్భానికి కారణమైన వారి పేరు చెప్పాలని బాలికను గదమాయించడంతో బాలిక జరిగిన విషయం తల్లికి వెల్లడించింది. దీంతో బాలిక తల్లి ముత్యాల రెడ్డి పల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ నరసప్ప విచారించారు. విచారణ సమయంలో తనపై అదే ప్రాంతానికి చెందిన మరోక వ్యక్తి వెంకటేశ్ (48) అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక పేర్కొనగా పోలీసులు విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందుతులపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.