Job Fraud | గుంటూరు జిల్లాలోని ఒక ప్రముఖ ప్రైవేట్‌ యూనివర్సిటీలో ఘరానా మోసం వెలుగుచూసింది. తోటి విద్యార్థులు, సీనియర్లను మోసం చేస్తూ ఓ బిటెక్ విద్యార్థి, ఏకంగా కోటిన్నర రూపాయలు వసూలు చేసి వారికి టోకరా వేశాడు. తమకు ఉద్యోగాలు ఇప్పించడం లేదు, ఇంటర్న్ షిప్ ఇవ్వడం లేదని బాధితులు ఫిర్యాదు చేయడంతో మంగళగిరి గ్రామీణ (రూరల్) పోలీసుస్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. యూనివర్సిటీలో చదువుతున్న తోటి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Continues below advertisement

మంగళగిరి రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన విజయ్‌ నరసింహ ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తాను ఒక 'స్టార్టప్‌ కంపెనీ'ని రన్ చేస్తున్నానని, అందులో చేరితే మంచి ఇంటర్న్‌షిప్‌తో పాటు భవిష్యత్తులో గ్యారెంటీగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని తోటి విద్యార్థులను నమ్మించాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన 40 మందికి పైగా విద్యార్థులు.. ఒక్కొక్కరు రూ. 5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు విజయ్ నరసింహకు ఇచ్చారు. ఈ విధంగా కాలేజీ క్యాంపస్ లోనే దాదాపు రూ. 1.50 కోట్ల వరకు అతను కాజేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 

Also Read: Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?

Continues below advertisement

తప్పించుకు తిరుగుతున్న విద్యార్థి..

అయితే, డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా అటు ఇంటర్న్‌షిప్ కానీ, ఇటు ఉద్యోగాల ఊసు కానీ లేకపోవడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. దీనిపై విజయ్ నరసింహను గట్టిగా నిలదీయగా.. అతను సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. దీంతో తాము దారుణంగా మోసపోయామని గ్రహించిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మంగళగిరి సీఐ బ్రహ్మం, ఎస్సై వెంకట్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ భారీ క్యాంపస్ వసూళ్ల వెనుక విజయ్‌ నరసింహ ఒక్కడే ఉన్నాడా? లేక కాలేజీకి చెందిన మరెవరైనా ఇందులో ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. టాలెంట్ నమ్ముకోవాలి అని, ఇలా డబ్బులకు జాబ్స్, అవకాశాలు ఇప్పిస్తాం అనే వారిని గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు యువతకు సూచించారు. ఎవరైనా ఇలా వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని సూచించారు.