Manipur Violence: 


పలు చోట్ల ఉద్రిక్తతలు..


మణిపూర్‌లో మరోసారి ఆందోళనకారులు రెచ్చిపోయారు. బిష్ణుపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఆటోమెటిక్ వెపన్స్‌తో కాల్పులు జరిపారు. జూన్ 16 న అర్ధరాత్రి మొదలైన ఈ కాల్పులు..తెల్లవారుజాము వరకూ కొనసాగినట్టు పోలీసులు వెల్లడించారు. పెద్ద ఎత్తున నిరసనకారులు గుమిగూడి విధ్వంసం సృష్టించారు. పలు చోట్ల వాహనాలను ధ్వంసం చేశారు. ఇంఫాల్‌లో అర్ధరాత్రి వరకూ పోలీసులు, ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు ఇళ్లకు నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఒకేసారి వెయ్యి మంది ఒక్క చోట చేరారు. ఈ లోగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది అప్రమత్తమై టియర్ గ్యాస్‌తో దాడి చేసింది. రబ్బర్ బులెట్స్ ప్రయోగించింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మణిపూర్ యూనివర్సిటీ వద్ద కూడా భారీ ఎత్తున అల్లర్లు జరిగాయి. రాత్రి 10.40 నిముషాలకు 200-300 మంది గుమిగూడి స్థాని ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆర్ఏఎఫ్‌ బలగాలు నిరసనకారులపై దాడి చేయడం వల్ల అంతా చెల్లాచెదురయ్యారు. సింజెమాయ్‌లోని బీజేపీ ఆఫీస్‌పైనా దాడికి యత్నించారు. ఒకేసారి పలుచోట్ల ఉద్రిక్తతలు చెలరేగడం పోలీసులకు,భద్రతా బలగాలకు సవాలుగా మారింది. చాలా వరకూ దాడులను అడ్డుకున్నారు. అయినా...ఏదో ఓ చోట విధ్వంసం కొనసాగుతూనే ఉంది. స్వయంగా కేంద్రహోం మంత్రి అమిత్‌షా వచ్చి పరిస్థితులు చక్కదిద్దాలని చూసినా...ఇంకా అదుపులోకి రావడం లేదు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఆరా తీస్తున్నారు. బీజేపీ నేతల ఇళ్లపైనా దాడులు జరుగుతుండటం రాజకీయంగానూ వేడి పెంచుతోంది.