హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివాహితను ఆమె భర్త హత్య చేసి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సినిమా కథను తలపించేలా స్టోరీ చెప్పాడు. చివరికి కూతుళ్లు వచ్చి ప్రశ్నించడంతో తప్పు చేశానని అంగీకరించాడు. నిందితుడు ఆంజనేయులు తన భార్య ఉమారాణిని హత్య చేసి, బాత్రూం పైన ఉన్న పెయింట్ డబ్బా ఆమె మీద పడిపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
నేరం బయటపడకుండా ఉండేందుకు ఆంజనేయులు తెలివిగా వ్యవహరించి, ఉమారాణిని సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా కావాలనే చాలా దూరంగా ఉన్న ఒక హాస్పిటల్కు తరలించాడు. అయితే, ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఉమారాణి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో భయపడిన నిందితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి, బాత్రూంలో పెయింట్ డబ్బా మీద పడటం వల్లే ఆమె చనిపోయిందని కట్టుకథలు చెప్పి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు.
అయితే, తండ్రి మాటలపై అనుమానం వచ్చిన కూతుళ్లు పదే పదే ప్రశ్నించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో తరచుగా చిన్నపాటి గొడవలు జరుగుతుండటం, తండ్రి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తన తప్పును ఒప్పుకున్న ఆంజనేయులు, గొడవ ముదిరి తానే భార్యను చంపినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
