Deputy Chief Minister Pawan Kalyan tour:    అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అత్యంత మారుమూల గిరిశిఖర గ్రామమైన నందిగరువులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను ఆడంబరాలకు పోకుండా గిరిజన గూడెం మధ్య జరుపుకున్నారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాటా-మంతి’ కార్యక్రమంలో ఆయన గిరిజనులతో నేరుగా ముచ్చటించి, దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 70 ఏళ్లుగా సరైన బాట లేని నందిగరువు గ్రామానికి రూ. 2 కోట్లతో నిర్మించిన నూతన రోడ్డును ఆయన పరిశీలించారు.

Continues below advertisement

పీపుల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ 

తమది పూర్తిగా పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ప్రజల కన్నీరు తుడవడమే తమ నిబద్ధత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలకు అందాల్సిన నిధులను అడ్డగోలుగా మళ్లించడం వల్లే ఏజెన్సీ ప్రాంతాలు వెనుకబడ్డాయని ఆయన విమర్శించారు.   జలజీవన్ మిషన్ పథకంలో రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. సమస్యలు చెప్పుకోవడానికి అప్పటి ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్తే కనీసం గ్రామం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల గడప దగ్గరకు వచ్చిందని పేర్కొన్నారు.

Continues below advertisement

 అభివృద్ధిలో వివక్షకు తావులేదు

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని అందిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా, తాము ఎక్కడా వివక్ష చూపలేదని ఆయన గుర్తు చేశారు.  మీరు ఓట్లు వేశారా లేదా అని మేము చూడటం లేదు, మీరు బాగుండాలనేదే మా ఆకాంక్ష అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు రావడానికి నాయకులు భయపడతారని, కానీ ప్రజల కోసం పనిచేసే తనకు ఎలాంటి భయాలు లేవని, గిరిజన హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

క్షేత్రస్థాయిలో పరిష్కారాలు 

కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓనూరు ప్రాథమిక పాఠశాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయడంతో పాటు, నందిగరువులోనే నూతన అంగన్వాడీ కేంద్రం, పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గిరిశిఖర ప్రాంతాల్లో గర్భిణీలు పడుతున్న డోలీ మోతల కష్టాలను తప్పించడానికి రాబోయే కాలంలో మరిన్ని రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచినీటిని ప్రతి ఇంటికి అందిస్తామని, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.

 నిబద్ధతతో కూడిన పాలన 

ఏజెన్సీలో గడిచిన 18 నెలల్లోనే 460 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించడం ఒక రికార్డు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాల భవనాలు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో   ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పవన్ కళ్యాణ్ రాకతో మారుమూల గిరిజన గ్రామాల్లో  సందడి వాతావరణం నెలకొంది.