Man Kills Father: కన్నతండ్రినే ఓ కొడుకు అతిదారుణంగా చంపేశాడు. ఐరన్ రాడ్‌తో కొట్టి తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత సొంత పొలంలోని  ఓపెన్ బోర్‌వెల్‌లో ఆ శరీర భాగాలను పారవేశాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీలోని శ్రద్ధావాకర్ హత్యోదంతం మరవకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఇదే రీతిలో కర్ణాటకలో ఓ హత్య జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు అతిదారుణంగా చంపేశాడు. ఐరన్ రాడ్‌తో కొట్టడంతో కుప్పకూలిన తండ్రి మృతదేహాన్ని 30 ముక్కలు చేశాడు. ఆ తర్వాత సొంత పొలంలోనే ఉన్న  ఓపెన్ బోర్‌వెల్‌లో ఆ శరీర భాగాలను వేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కర్ణాటకలోని బగల్‌కోట్‌లో చోటుచేసుకుంది.  పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రొక్లెయిన్‌లను తెచ్చారు. ఓపెన్ బోర్‌వెల్‌ను తవ్వించారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. 


మద్యం మత్తులో వాగ్వివాదం.. ఆపై దారుణం.. 
పరశురామ్ కులాలీ రోజూ మద్యం సేవిస్తాడు. అతనికి ఇద్ధరు పిల్లలు. పెద్ద కుమారుడు తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు. 20 సంవత్సరాల వయసున్న చిన్న కుమారుడు విఠల్‌, పరశురామ్ కలిసి ఉంటున్నారు. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చి చిన్న కొడుకు విఠల్‌ను పరశురామ్ కులాలీ దూషించేవాడు. గత మంగళవారం కూడా పరశురామ్ విఠల్‌ను తిట్టాడు. ఘటన జరిగిన రోజు, పరశురాం విఠల్‌తో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఉన్న  విఠల్ ఆవేశంతో ఇనుప రాడ్ చేతిలోకి తీసుకుని తండ్రిని బాదాడు. ఆ దెబ్బతో తండ్రి కుప్పకూలిపోయాడు. పరశురామ్ మరణించాడని నిర్దారించుకున్న విఠల్‌ తండ్రి డెడ్ బాడీని 30 భాగాలుగా కట్ చేశాడు. వాటిని బగల్‌కోట్ జిల్లాలోని ముధోల్ శివారులో మంతూరు బైపాస్ దగ్గర ఉన్న వారి సొంత సాగు భూమిలోని ఓపెన్ బోర్‌వెల్‌లో వేశాడు. 
ఒక మనిషిని జంతువులను  కోసినట్లు ముక్కలు చేసే ఇలాంటి  క్రూరమైన నేరం ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యోదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్యతీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా ఆమెను హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. ఇప్పుడు ఈ కేసు కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసును పోలి ఉంది.


అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు. అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కానీ చాలా కాలం నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.