Rajasthan Crime News:


రాజస్థాన్‌లో ఘోరం..


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఆస్తి వివాదంలో ఓ యువకుడిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడో వ్యక్తి. సొంత తమ్ముడిపై ట్రాక్టర్ ఎక్కించి బలవంతంగా 8 సార్లు తొక్కించాడు. టైర్ల కింద బాధితుడి శరీరం నుజ్జునుజ్జైంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా హత్యకు దారి తీసింది. ఏ మాత్రం బతికే అవకాశం లేకుండా చనిపోయాడని కన్‌ఫమ్ చేసుకునేంత వరకూ ట్రాక్టర్‌తో తొక్కించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ భరత్‌పూర్‌లోని ఓ స్థలంపై చాలా రోజులుగా తగాదా పడుతున్నారు. ఇవాళ ఉదయం (అక్టోబర్ 25) బహదూర్ సింగ్ కుటుంబం వివాదాస్పద స్థలం వద్దకు ట్రాక్టర్‌పై వెళ్లింది. ఆ తరవాత అతర్ సింగ్‌ కుటుంబమూ అక్కడికి చేరుకుంది. వచ్చీ రాగానే రెండు కుటుంబాలూ కర్రలతో కొట్లాడుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కొంత మంది తుపాకులతోనూ కాల్చినట్టు స్థానికులు చెబుతున్నారు. బులెట్ శబ్దాలు విపించినట్టు తెలిపారు. ఈ గొడవలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. ఇది గమనించిన వెంటనే అన్న ట్రాక్టర్‌తో మీదకి వెళ్లాడు. దాదాపు 8 సార్లు ముందుకు వెనక్కి వెళ్లి చనిపోయేంత వరకూ అలాగే తొక్కాడు. కుటుంబ సభ్యులు ఆపాలని ఎంత ప్రయత్నించినా పట్టించుకోకుండా కసితీర్చుకున్నాడు. ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. 


రాజకీయ రచ్చ..


పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 5 రోజుల క్రితమే ఈ రెండు కుటుంబాలు గొడవ పడ్డాయి. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఓ వర్గం వాళ్లు మరో వర్గంపై పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఇక ఈ ఘటనలు పొలిటికల్ హీట్ పెంచాయి. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని పలువురు నేతలు మండి పడ్డారు. ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.