AI Powered Rail RoboCop SC Arjun:  టెక్నాలజీ తోడైతే నేరగాళ్లకు తప్పించుకోవడం అసాధ్యమని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఏఐ పవర్డ్ రోబో కాప్ ASC అర్జున్ నిరూపించింది. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయం.. స్టేషన్ ఎప్పటిలాగే ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అర్జున్ రోబో, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని స్కాన్ చేసింది. కేవలం సెకన్ల వ్యవధిలోనే తన డేటాబేస్‌లో ఉన్న పాత నేరస్థుల ఫోటోలతో సరిపోల్చి, అతను  హార్డ్‌కోర్ క్రిమినల్  అని గుర్తిస్తూ ఆర్‌పీఎఫ్  కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ పంపింది.

సెకన్ల వ్యవధిలో అలర్ట్.. మెరుపు వేగంతో వేట 

రోబో నుంచి సిగ్నల్ రాగానే  డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ లైవ్ సీసీటీవీ ఫీడ్‌ను విశ్లేషించారు. వెంటనే సబ్ ఇన్‌స్పెక్టర్ కీర్తి రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ ప్రివెన్షన్ టీమ్‌ను అప్రమత్తం చేశారు. రోబో ఇచ్చిన స్పష్టమైన సమాచారంతో పోలీసులు స్టేషన్ ఎంట్రీ పాయింట్ వద్దే నిందితుడు హడప శివ, అతని అనుచరుడు జి. బంగారును చుట్టుముట్టారు. ఎలాంటి ప్రయాణ టిక్కెట్లు లేకుండా, దొంగతనానికి పథకం వేసి స్టేషన్‌లో అడుగుపెట్టిన ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

నేర చరిత్ర చూసి పోలీసులే షాక్

పట్టుబడిన వారిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ సామాన్యమైన దొంగలు కాదు.. రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యలు, దోపిడీలు, డెకాయిటీలు , ఆయుధాల అక్రమ రవాణా వంటి అనేక తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేలింది. రైలు ప్రయాణికులే లక్ష్యంగా స్టేషన్లోకి ప్రవేశించిన ఈ  ముఠా’ పనిని ఏఐ రోబో ఆరంభంలోనే పసిగట్టి కటకటాల వెనుకకు పంపింది. 

 ప్రయాణికుల భద్రతకు ఏఐ శ్రీరామరక్ష

ఈ ఘనతపై వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా హర్షం వ్యక్తం చేశారు. కిక్కిరిసిన బహిరంగ ప్రదేశాల్లో కూడా నేరగాళ్లను క్షణాల్లో గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటన నిరూపించిందన్నారు. రోబో అర్జున్ ఇప్పుడు ప్రయాణికులకు ఒక భరోసాలా మారిందని, భవిష్యత్తులో రైల్వే భద్రతలో ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను మరింతగా ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు.