Love Couple Suicide In Palakollu Railway Station: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అయితే, వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమనుకున్నారు. రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, చివరి నిమిషంలో ప్రియురాలు బతకాలని భావించిన ప్రియుడి ఆమెను రైలు పట్టాల నుంచి కిందకు తోసేశాడు. తాను మాత్రం రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. హృదయ విదారక ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా (Westgodavari District) పాలకొల్లులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లు (Palakollu) రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని, అలాగే తీవ్ర గాయాలతో విలపిస్తూ ఉన్న యువతిని స్థానికులు గుర్తించారు. గాయాలతో పడి ఉన్న యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గణపవరానికి చెందిన రాజేశ్, ఎస్.కొండేపాడు గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో గురువారం రాత్రి భీమవరం నుంచి బండిపై పాలకొల్లు వచ్చారు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపైకి వెళ్లగా.. ట్రైన్ దగ్గరకు రాగానే యువతి బతకాలని భావించిన ప్రియుడు ఆమెను పట్టాల పైనుంచి కిందకు నెట్టేశాడు. అనంతరం అతను మాత్రం రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి స్పృహ వచ్చే సరికి ప్రియుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Nuziveedu: ప్రభుత్వం జోక్యం చేసుకున్నా మారని నూజివీడు ట్రిపుల్ ఐటీ- ఫుడ్‌పై ఇంకా విద్యార్థుల ఫిర్యాదు