తమిళనాడు(Tamilanadu)లోని తిరుచ్చిలో ఓ ప్రైవేటు కాలేజీలో విద్యార్థి కనిపించకుండా పోయాడు. కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కుర్రాడు సాయంత్రానికి తిరిగిరాలేదు. ఫ్రెండ్‌ ఇంట్లో ఉంటాడేమో అని రాత్రి వరకు చూశారు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. మరింత కంగారు పడిన ఆ ఫ్యామిలీ తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి వాకాబు చేశారు. ఎవరికీ ఆ కుర్రాడి ఆచూకి తెలియలేదు. ఫ్రెండ్స్‌ను కూడా కనుక్కున్నారు. వాళ్లు కూడా తమకు తెలియదని చెప్పారు. 


తల్లిదండ్రుల్లో కంగారు


కుమారుడు కనిపించకపోయేసరికి ఆ రాత్రంతా జాగారం చేసిందా ఫ్యామిలీ. తెల్లవారేసరికి కాలేజీకి వెళ్లారు. ఆ రోజు అసలు ఆ కుర్రాడు కాలేజీకే రాలేదని షాకింగ్ న్యూస్ చెప్పారు. అంతే తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎంట్రీ ఇచ్చినా కొన్ని రోజుల పాటు విచారణ సాగింది. 


సెల్‌ చెప్పిన గుట్టు


కుర్రాడి సెల్‌ఫోన్ ఆధారంగా విచారించిన పోలీసులు... కొన్ని రోజుల తర్వాత అందరి ఫ్యూజులు ఎగిరిపోయే విషయాలు చెప్పారు. పాఠాలు చెప్పే లెక్చరర్‌తో కుర్రాడు ప్రేమలో ఉన్నట్టు తేల్చారు. కుర్రాడి ఫోన్ స్విచ్ఛాప్‌ అయిన టైంలోనే ఆ మేడం ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌ అయినట్టు గుర్తించారు. కొన్ని రోజుల తర్వాత ఆ మేడం వేరే సిమ్‌ వేసి వాడుతున్నట్టు గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి ఆచూకీ కనిపెట్టారు. 


లెక్చరర్‌ ప్రేమాయణం


విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాల్సిన లెక్చరర్‌ ఇలా ప్రేమపాఠాలు చెప్పాలని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఇద్దరి మధ్య పదేళ్ల వయసు తేడా ఉంటుంది. అయినా అవేం పట్టించుకోకుండా మైనర్‌తో ప్రేమాయణం సాగించిందామె. 


చెల్లుబాటు కాని వివాహం


వారి ఆచూకీ తెలుసుకన్న పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆ బాలుడిని జువైనల్ హోంకు పంపించారు. ఆ లెక్చరర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్‌ కావడంతో ఈ కేసు పెట్టారు. వాళ్లు చేసుకున్న వివాహం కూడా చెల్లు బాటు కాదని పోలీసులు చెప్పారు. 


తమిళనాడులో ఇలాంటి ఘటనలు ఎక్కువ


తమిళనాడులో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ఇలా విద్యార్థులను మోసం చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఓ వార్డెన్‌ కూడా ఇలాంటి కేసులో ఇరుక్కున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు ఈ కేసు ఒక ఎత్తు అంటున్నారు పోలీసులు.