కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన పేరు సిద్ధప్ప. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన సిద్దప్ప కోడుమూరులో తన అనుచరులతో ఉన్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి చంపారు. పక్కా ప్రణాళిక రచించుకొని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో సిద్దప్ప అక్కడికక్కడే చనిపోయారు.


సిద్దప్ప అనే వ్యక్తి గతంలో కొన్ని హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2008లో హత్యకు గురైన టీడీపీ నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు మర్డర్ కేసుతో పాటు కున్నూరు గ్రామంలో జరిగిన మూడు హత్యల్లో ఈ సిద్ధప్ప నిందితుడిగా ఉన్నారు. అయితే, వివిధ కారణాలతో ఆయన అంతకుముందు ముందు నుంచి ఉంటున్న కున్నూరు గ్రామంలో కాకుండా కోడుమూరులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజా హత్య జరిగింది.


అయితే, పాత కక్షలు పెంచుకోవడం వల్లే ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని సిద్దప్ప మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కోడుమూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.