Kumbakonam Honor Killing: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను యువతి కుటుంబసభ్యులు దారుణంగా హతమార్చారు. తమిళనాడు కుంభకోణంలో జరిగిన పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని నమ్మించి ఇంటికి ఆహ్వానించి మోసం చేసి నూతన దంపతులను హత్య చేశాడు యువతి సోదరుడు. ఇంట్లో వాళ్లు వేరే సంబంధం చూస్తుండటం, పెళ్లికి బలవంతం చేయడంతో ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని, ఇంటికి ఫోన్ చేసి తన పెళ్లి విషయాన్ని చెప్పింది యువతి. దాంతో ఆమె సోదరుడు ఉన్మాదిగా మారాడు.


24 ఏళ్ల యువతి శరణ్య, 31 ఏళ్ల మోహన్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. తాము చూసిన వ్యక్తిని కాదని, వేరే వ్యక్తినిపెళ్లి చేసుకుంది. దీంతో కొత్త జంటపై కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు చెల్లిని, భావను ఇంటిని ఆహ్వానించి దారుణంగా హత్య చేశాడు. రంజిత్ అనే యువకుడికి ఇచ్చి శరణ్యకు వివాహం చేయాలని, ఆమె సోదరుడు శక్తివేల్ (31) భావించాడు. కానీ తాను కోరుకున్నట్లు జరగకపోవడం, సోదరి వేరే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని శక్తివేల్ దారుణానికి పాల్పడ్డాడు. 


అసలేం జరిగిందంటే..
తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తులుక్కవేళి గ్రామానికి చెందిన శరణ్య చెన్నైలో నర్సుగా పనిచేస్తోంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని సైతం ఆమె చెన్నైకి తీసుకెళ్లి, ట్రీట్మెంట్ చేయిస్తోంది. ఈ క్రమంలో 5 నెలల కిందట మోహన్ అనే యువకుడితో ఆసుపత్రిలో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. శరణ్య, మోహన్‌ల ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. అదే సమయంలో శరణ్యకు ఆమె సోదరుడు శక్తివేల్.. రంజిత్ (28) అనే యువకుడితో వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.


ప్రేమ వివాహం, అంతలోనే విషాదం..
తన స్నేహితుడు రంజిత్‌ను వివాహం చేసుకోవాలని శరణ్యపై ఆమె సోదరుడు ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక లాభం లేదని భావించి శరణ్య, మోహన్ కొన్ని రోజుల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంటికి ఫోన్ చేసి తాను మోహన్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో శక్తివేల్ సహా కుటుంబసభ్యులు షాకయ్యారు. జరిగిందేదో జరిగిపోయిందని, రిసెప్షన్​ కోసం ఇంటికి రావాలని కొత్త జంటను ఆహ్వానించాడు. పెళ్లైన ఐదో రోజున శరణ్య తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. 


పుట్టింట్లో ఈవెంట్ పూర్తి కావడంతో శరణ్య తన భర్త మోహన్‌తో తులుక్కవేళి నుంచి చెన్నైకి బయలుదేరింది. కానీ తాను చెప్పినట్లు చెల్లెలు వినకుండా వేరే వ్యక్తికి పెళ్లి చేసుకుందని వారిపై కక్షగట్టిన శక్తివేల్ సోదరి శరణ్య, బావ మోహన్ లను వెంటాడి దాడి చేశాడు. అతడికి రంజిత్ సహకరించాడు. వీరి దాడిలో కొత్త జంట జీవితం పెళ్లైన 5 రోజులకే ముగిసిపోయింది. జంట హత్య కేసులో శక్తివేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. శరణ్య ఎస్సీ సామాజిక వర్గం కాగా, మోహన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని తంజావూరు ఎస్పీ జి. రవళి ప్రియ ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 


Also Read: Vijayawada: ప‌బ్జీ ఆడే బాలుడిది హత్యా ఆత్మహత్యా? సవతి తల్లే అంతం చేసిందా?