Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూశాక ఈ సందేహాలు ఎక్కువయ్యాయి. అయితే...ఆమెపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ విచారణలో తేలింది. ఆగస్టు 13వ తేదీన ఈ కేసుని హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. సామూహిక అత్యాచారం జరిగిందా అన్న కోణంలో విచారణ జరపగా అదేమీ లేదని తేలింది. సంజయ్ రాయ్‌ ఒక్కడే హత్యాచారం చేసినట్టు వెల్లడైంది. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లోనూ ఇదే తేలింది. సంజయ్ రాయ్‌ ఆమెపై అత్యాచారం చేసి చంపినట్టు నిర్ధరణ అయింది. DNA రిపోర్ట్‌ కూడా ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. ఆగస్టు 10వ తేదీన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఓ బ్లూటూత్‌ డివైజ్‌ ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. 


నిందితుడు సంజయ్‌ రాయ్‌పై గతంలో గృహ హింస కేసులు నమోదయ్యాయి. అతని నాలుగు పెళ్లిళ్లైనట్టు విచారణలో తేలింది. రోజూ తాగొచ్చి భార్యల్ని చిత్రహింసలకు గురి చేసే వాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడి ప్రవర్తన గురించి అత్త కూడా షాకింగ్ నిజాలు వెల్లడించింది. అయితే...అతను ఒక్కడే ఈ పని చేసి ఉండడని, ఇంకెవరి హస్తమో ఉందని ఆమె ఆరోపించారు. కానీ...విచారణలో మాత్రం అందులో నిజం లేదని వెల్లడైంది. ఈ రిపోర్ట్‌ని నిపుణులకు పంపించి తుది అభిప్రాయానికి రావాలని CBI భావిస్తోంది. అయితే...గతంలో ఓ డాక్టర్‌ ఆమె శరీరంలో 151 గ్రాముల వీర్యాన్ని గుర్తించినట్టు చెప్పారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండచ్చని అన్నారు. అప్పటి నుంచే ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు. 


Also Read: Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్