Karnataka Crime: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్బగల్‌ టౌన్‌కి చెందిన ఓ బాలుడు కన్నతల్లినే హత్య చేశాడు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో సంచలన హత్య చేయడానికి కారణమేంటో చెప్పాడు నిందితుడు. తల్లిని బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలని అడిగాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. "నువ్వు నా కొడుకువే కాదు" అని వాదించినట్టు పోలీసులకు వివరించాడు. కానీ...ఆ బాలుడు చెప్పేవి నిజం అని నమ్మలేమని పోలీసులు వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు 17 ఏళ్ల మైనర్. రాడ్‌తో తల్లి తలపై గట్టిగా కొట్టడం వల్ల ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తరవాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. నిందితుడి సోదరి జార్జియాలో మెడిసిన్ చేస్తోంది. 


"నిందితుడిని విచారించాం. తల్లి తనను సరిగ్గా పట్టించుకోడం లేదని చెప్పాడు. సరైన ఫుడ్ కూడా పెట్టడం లేదని అన్నాడు. ఫిబ్రవరి 2వ తేదీన కాలేజ్‌కి వెళ్లే సమయంలో కొడుకుని ఏదో విషయంలో తల్లి మందలించింది. ఇద్దరి మధ్యా చాలా సేపు వాగ్వాదం జరిగింది. బ్రేక్‌ఫాస్ట్ పెట్టమని కొడుకు అడిగాడు. అందుకు తల్లి ఒప్పుకోలేదు. ఒక్కసారిగా కోపంతో మెటల్ రాడ్‌తో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడు చెప్పిందంతా నిజమేనన్న నిర్ధరణకు రాలేదు. పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నాం"


- పోలీసులు