Kanjhawala Case:


కార్ ఓనర్ అరెస్ట్..


కంజావాలా కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుతో ఐదుగురి నిందితులతో పాటు మరి కొందరికీ సంబంధం ఉందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. అయితే...ఇప్పుడు ఆరో వ్యక్తిని పట్టుకున్నారు. కార్ ఓనర్ అశుతోష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం ఐదుగురు నిందితులనూ ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో చిక్కు ముడులున్నాయి. అంజలి కార్‌ కింద చిక్కుకుందని తెలిసినా పట్టించుకోకుండా లాక్కెళ్లారని తన స్నేహితురాలు నిధి చెప్పింది. అయితే... ఈమె మాటల్లోనూ నిజమెంత అన్నది స్పష్టత రావడం లేదు. నిధి తల్లి కూడా అంజలిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. "కావాలనే వాళ్లు అంజలిపైకి కార్‌ ఎక్కించారని నా కూతురు చెప్పింది" అని  నిధి తల్లి వెల్లడించారు. ఇది కచ్చితంగా హత్యేనని అంటున్నారు. తన కూతురునీ చంపేందుకు వాళ్లు ప్రయత్నించారని...అదృష్టవశాత్తు తప్పించుకుని వచ్చిందని అన్నారు. అయితే..పోలీసులు మాత్రం ఇది హత్య అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. కార్‌లో ఉన్న  ఐదుగురితో పాటు మరో ఇద్దరికీ ఈ కేసుతో సంబంధం ఉందని చెప్పారు. ఇప్పుడా ఆరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంజలి ఫ్రెండ్ నిధిని కీలక సాక్ష్యంగా భావిస్తున్నారు. కార్ ఓనర్ అశుతోష్..ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోయినా..నిందితులకు సహకరించాడని పోలీసులు స్పష్టం చేశారు. మరో నిందితుడు అంకుశ్ ఖన్నా కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. "వీళ్లిద్దరూ కార్‌లో ఉన్న ఐదుగురుని శిక్ష పడకుండా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని తెలిపారు. అశుతోష్‌కు కార్ ప్రమాదం గురించి తెలిసినా...తమకు చెప్పలేదని అన్నారు. 


ఎన్నో అనుమానాలు..


ఇంకా కొన్ని విషయాల్లో స్పష్టత రావడం లేదు.  అందుకే...పోలీసులు ఆ నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడి నుంచి ఎందుకు పరారయ్యారు..? ఇది కావాలనే చేశారా..? అనే నిజా నిజాలు బయటకు రావాలంటే..ఈ టెస్ట్ తప్పదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే...యాక్సిడెంట్ చేశాక కూడా అసలేమీ జరగనట్టుగా తిరిగారు నిందితులు. అంతే కాదు. కార్‌ ఓనర్‌కు ఆ కార్‌ని తిరిగి ఇవ్వలేదు కూడా. "అంత రాత్రి పూట నిద్ర లేపి కార్‌ ఇవ్వడం ఎందుకని ఆగిపోయాం" అని నిందితులు విచారణలో చెప్పినప్పటికీ పోలీసుల అనుమానం తీరలేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...సీసీటీవీ ఫుటేజ్‌ మిస్ మ్యాచ్ అవుతోంది. నిధి ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన విజువల్స్ ప్రకారం చూస్తే...ఆమె తన ఇంటికి తిరిగి వచ్చిన టైమ్ 1.36 AM. కానీ... పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే...ఆ సీసీటీవీ DVR 45-50 నిముషాలు లేట్‌గా నడుస్తోందని. ఇక నిధి, అంజలి హోటల్ నుంచి బయటకు వచ్చిన టైమ్‌ని సీసీటీవీలో చూస్తే 1.32AM. కానీ...ఇక్కడ కూడా CCTV 15 నిముషాలు ఆలస్యంగా నడుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఫలితంగా..ఈ "టైమింగ్స్‌" మిస్‌మ్యాచ్ అవుతున్నాయి.