Kamareddy News : కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది అత్త. 4 నెలల గర్భిణీ అని చూడకుండా అత్త ఈ దారుణానికి ఒడిగట్టింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ కుమార్తె కీర్తనను అదే గ్రామానికి చెందిన కురటి పండరితో 2021లో వివాహం చేశారు. పెళ్లైన మొదటి నుంచి కీర్తనకు వేధింపులు మొదలయ్యాయి. నిత్యం  గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దల సమక్షంలో  పంచాయితీ కూడా జరిగింది. నిత్యం గొడవల కారణంగా, గ్రామస్థుల సూచనతో కీర్తన భర్తతో కలిసి హైదరాబాద్ పనికోసం వలస వెళ్లింది. పొలం పనులు ఉన్నాయని అత్త అంబవ్వ కీర్తనను ఇటీవల ఇంటికి పిలిపించింది. భార్యభర్తలు కీర్తన, పండరి అచ్చంపేటకు వచ్చారు. పండరి పొలం పనులకు వెళ్లగానే పథకం ప్రకారం కోడలు కీర్తనపై అత్త అంబవ్వ పెట్రోల్ పోసి నిప్పంటింది. బాధితురాలు తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కురటి అంబవ్వను జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ రాజు తెలిపారు. 


కీర్తన నాలుగు నెలల గర్భవతి 


కీర్తన నాలుగు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఆమెకు అబార్షన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. కీర్తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 


వివాహిత ఆత్మహత్యాయత్నం


శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఓ వివాహిత తన పిల్లలను వెంటబెట్టుకొని వచ్చి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. తనకు, తన పిల్లలకు చెందాల్సిన ఆస్తిని తన భర్త, అత్త, ఆడపడుచు, బావ కావాలనే తనను హక్కుదారుగా తప్పించి, తనకు తెలియకుండా వేరే వాళ్లకు అమ్మేశారని కన్నీరుమున్నీరు అయింది. ఉన్న ఆస్తిని అమ్మేసి తనకు, తన పిల్లలకు అన్యాయం చేశారంటూ ఆరోపించింది. టెక్కలిలోని కచేరి వీధికి చెందిన ఉల్లాస సంగీత.. తన పిల్లలు మృదుల, తేజలతో కలిసి పురుగుల మందు చేత పట్టుకొని నడిరోడ్డుపైకి వచ్చింది. తమకు న్యాయం చేయకపోతే.. ఇక్కడే ప్రాణాలు తీస్కుంటామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 


అసలేం జరిగింది?


టెక్కలిలోని కచేరి వీధికి చెందిన ఉల్లాస సూర్య కుమార్, సంగీత దంపతులకు 2011లో వివాహం జరిగింది. వీరికి పదేళ్ళ కుమార్తె, ఎనిమిదేళ్ళ కుమారుడు ఉన్నారు. వివాహం జరిగిన తరువాత కొన్నేళ్ల పాటు వీరు హైదరాబాద్ లోనే పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. కొంత కాలం కిందటే టెక్కలికి వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తన భర్త సూర్య కుమార్ పై కోర్టులో మనోవర్తి కేసుతో పాటు ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇల్లు, స్థలంపై తనకు తన పిల్లలకు హక్కు కల్పించాలని కోర్టును ఆశ్రయించింది.


తనకు తెలియకుండానే ఇంటి అమ్మకం..


అయితే సదరు స్థలం అంశం కోర్టు పరిధిలో ఉండగా తన భర్త సూర్య కుమార్ తో పాటు ఉర్లాపు చిన్నమ్మడు, ఆడ పడుచు పి. లక్ష్మీ, బావ రమేష్ కలిసి రెవెన్యూ అధికారుల ద్వారా.. తన పేర్లను హక్కుదారుగా తప్పించారని సంగీత వాపోయింది. 2021 అక్టోబర్ 29న రెవెన్యూ అధికారుల ద్వారా లీగల్ హైర్ చేయించి ఇంటి స్థలాన్ని పట్టణానికి చెందిన మోణింగి శ్రీనివాస రావు అనే వ్యక్తికి తనకు తెలియకుండానే అమ్మకం చేపట్టినట్లు వివరించింది. భర్త, అత్త, బావ, ఆడపడుచులు కావాలనే తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ... కన్నీరుమున్నీరుగా విలపించింది. కోర్టులో ఉన్న స్థలానికి రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారనీ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేశారని బాధితురాలు మీడియా ఎదుట సంగీత ఆవేదన వ్యక్తం చేసింది.