Kakinanda News : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రాథమికంగా నిందితుడిగా తేల్చామని కాకినాడ ఎస్పీ రవీంద్ర నాథ్ మీడియాకు తెలిపారు. ఈ కేసు వివరాలను తెలిపిన ఎస్పీ... కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు ఎమ్మెల్సీపై 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశామన్నారు. 19న ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడంలో కొంత ఆలస్యం జరిగిందని, బాధితుడి తల్లి ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేశామన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు కోసం ఆరు బృందాలతో గాలించామన్నారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరిస్తూ, ఎమ్మెల్సీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఇవాళ మార్నింగ్ ఎమ్మెల్సీని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. కస్టడీలో పూర్తిగా విచారణ చేశామన్నారు.  విచారణలో ప్రాథమికంగా ఎమ్మెల్సీని నిందితుడిగా గుర్తించామన్నారు. విచారణ అనంతరం కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. 


కేసు వివరాలు ఇలా 


'ఈ నెల 19న సుబ్రహ్మణ్యం 8 గంటల ఇంట్లోంచి బయటకు వచ్చాడు. లిక్కర్ కొనుక్కొని శ్రీరాంనగర్ ప్రాంతంలో స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఆ మార్గంలో వెళ్లూ వీళ్లను చూసి ఆగారు. ఎమ్మెల్సీ పిలవడంతో సుబ్రహ్మణ్యం ఆ కారులో ఎక్కాడు. ఆ రోడ్డులో అలా ముందుకు వెళ్లాడు. జన్మభూమి పార్కు ఏరియాలో టిఫిన్ తీసుకుని అక్కడ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటికి వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు కొంత డబ్బులు ఇచ్చారు. అవి తిరిగి ఇవ్వలేదన్న దానిపై కొంత చర్చ జరిగింది. ప్రవర్తన మార్చుకుంటే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని మీ అమ్మ కోరింది. కానీ నవ్వు పవర్తన మార్చుకోలేదని ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యంతో అన్నారు. ప్రవర్తన మార్చుకోలేదన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.  సుబ్రహ్మణ్యాన్ని కొట్టడానికి ఎమ్మెల్సీ ముందుకు వెళ్లారు. లిక్కర్ సేవించి ఉండడంతో సుబ్రహ్మణ్యం కూడా తిరగబడ్డాడు. ఎదురుతిరిగి మాట్లాడడంతో ఎమ్మెల్సీ ఇగో హర్ట్ అయి సుబ్రహ్మణ్యం మెడపట్టుకుని నెట్టాడు. అపార్ట్ మెంట్ దగ్గర గట్టుపై డ్రైవర్ పడిపోయాడు. తలపై గాయం అయింది. దీంతో సుబ్రహ్మణ్యం మళ్లీ తిరగబడ్డాడు. అప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మెడపట్టుకుని నెట్టడంతో తలకు తీవ్రగాయం అయింది. సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారులో తీసుకెళ్తుండడంతో ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు ఇచ్చాడు. అప్పటికే సుబ్రహ్మణ్యం  చనిపోయాడు' అని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.  


కర్రతో కొట్టి గాయాలు


'సుబ్రహ్మణ్యం మద్యం సేవించినప్పుడల్లా యాక్సిడెంట్స్ చేస్తాడని, అలా నమ్మించేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నించాడు. అందుకే సుబ్రహ్మణ్యం శరీరంపై కర్రతో కొట్టి గాయాలు చేశాడు. బాడీపై గాయాలు చేసి కారులో ఎక్కించుకుని తల్లిదండ్రులు ఫోన్ చేశాడు. బైక్ ప్రమాదం జరిగిందని మృతుడి తల్లిదండ్రులకు చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసి ఆసుపత్రికి జాయిన్ చేశామని చెప్పి, చివరకు చనిపోయాడని చెప్పి బాడీని తల్లిదండ్రులకు అప్పగించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు' అని ఎస్పీ తెలిపారు.