Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్ బాలిక అత్యాచారం కేసు గంట గంటకూ మలుపులు తిరుగుతుంది. మే 28న జరిగిన ఘటనపై గత వారంలో రోజులుగా చర్చ జరగుతూనే ఉంది. జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో జరిగిన పార్టీకి హాజరైన బాలికను ఇంటి దగ్గర దిగబెడతామని కారులో ఎక్కించుకున్న కొందరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముందు ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కొడుకు, హోంమంత్రి మనవడు ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే చివరకు పోలీసులు ట్వి్స్ట్ ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించామని, వారిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే అనుహ్యంగా ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. రంగంలోకి దిగిన బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడించాయి. ఆ తర్వాత కాంగ్రెస్, జనసేన, వైఎస్ఆర్టీపీ వరుసగా జూబ్లీహిల్స్ పీఎస్, డీజీపీ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి , పోలీసులు ఆగమేఘాలపై నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. 


బీజేపీ ఎంట్రీతో సీన్ రివర్స్! 


ముందుగా  ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసుపై మొదటి సారి స్పందించారు. శుక్రవారం వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ప్రెస్ మీట్ పెట్టారు. ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు. వీరిలో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. అయితే ఎమ్మెల్యే కొడుకు, హోంమంత్రి మనవడికి కేసుతో సంబంధం లేదన్నారు. వారికి క్లీన్ చీట్ ఇచ్చేశారు. ఈ ఘటనపై తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్న బీజేపీ వాటిని బయటపెట్టడం మొదలు పెట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ ప్రెస్ మీట్ పెట్టి ఫొటోలు, వీడియోలు బయటపెట్టారు. ఈ కేసుతో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడుతో సంబంధం ఉందని ఆరోపించారు. మైనర్ల అని చెబుతున్న పోలీసులు పెద్ద వాళ్ల కుమారులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్న బీజేపీ.. ఈ కేసును సీబీఐతో విచారణ జరపాలని డీజీపీకి వినతి పత్రం కూడా అందించారు. 


పోలీసులకు సవాళ్లు 


ఈ కేసులో మొదటి నుంచి పోలీసులకు సవాళ్లు ఎదురువుతున్నాయి. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముందుగా కాస్త నిదానంగానే దర్యాప్తు చేశారు. అయితే మీడియా అటెన్షన్ ఈ కేసుపై పడడంతో నిందితుల కోసం వేట మొదలెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలెట్టారు. ఐదుగురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేశారు. అయితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు ఈ కేసులో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మాత్రం పోలీసులు నిర్థారించడంలేదు. అయితే పోలీసులు సేకరించిన ఫొటోలు, వీడియోలు కొన్ని లీక్ అయ్యాయి. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ బయటకురాకుండా జాగ్రత్తపడుతున్నారు. సీసీ ఫుటేజ్ బయటకు వస్తే అసలు నిందితులు ఎవరో తెలుస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. పోలీసులు మాత్రం మైనర్ల కేసులో ఉన్నందున ఆ వివరాలు చెప్పలేం అంటున్నారు. వీటితో పాటు ఘటన జరిగిన రోజు రెడ్ మెర్సిడెస్ కారుతో పాటు మరో ఇన్నోవా కారులో యువకులు ఫాలో అయ్యారు. దానిపై ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉంది. ఆ కారు ఎక్కడ ఉందనే విషయం సస్పెన్స్ లో ఉంది. ఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా ఇన్నోవా కారును ఎందుకు సీజ్ చేయలేదన్న అనుమానాలు వస్తున్నాయి. 


అత్యాచారం జరిగింది ఇన్నోవా కారులోనే! 


జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36 లోని అమ్నీషియా పబ్‌లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాన్‌ లిక్కర్‌ ఈవెంట్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీకి 150 మంది హాజరయ్యారు. వీరిలో 80 శాతం మంది మైనర్లే ఉన్నారు. వారిలో ఒక బాలిక పబ్‌లో పరిచయమైన స్నేహితులతో కాసేపు సరదాగా మాట్లాడింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక బాలుడు(16), మిగిలిన స్నేహితులతో కలిసి బాలిక పబ్ బయటకు వచ్చింది. వారిలో ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు యువకులు ఉన్నారు. వారు బాలికను బెంజి కారులో ఎక్కించుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్ద కారు ఆగింది. అక్కడ ఓ అరగంట పాటు సరదాగా గడిపారు. అక్కడి నుంచి వేరే కారులో ఇంట్లో దింపుతామని ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు బాలికతో చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకుని 6.30 గంటల ప్రాంతంలో అతడు, మరో అయిదుగురు ఇన్నోవా వాహనంలో బయలు దేరారు. ఈ మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. మిగిలిన అయిదుగురు ఆమెపై కారులోనే అత్యాచారం చేశారని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితులు బాధితురాలిని అమ్నీషియా పబ్‌ వద్ద దింపేసి వెళ్లిపోయారు.