JNTU Student Suicide: జేఎన్టీయూ క్యాంపస్ లో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ ఉత్తమ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్లాస్ రూం కాంప్లెక్స్ భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఇంటర్నల్ పరీక్ష రాసి భోజనం చేసి.. మరో పరీక్ష రాసేలోపే ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 


అసలేం జరిగిందంటే..?


ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన ఇసానక మనోజ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. భార్య, 21 ఏళ్ల కుమార్తె మేఘనారెడ్డితో కలిసి కూకట్ పల్లి వివేకానంద్ నగర్ లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఇంటర్నల్ పరీక్ష రాసిన మేఘన మధ్యాహ్నం 2 గంటలకు చివరి ఏడాది సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉంది. దానికి పావు గంట ముందు 1.45 గంటల ప్రాంతంలో క్యాంపస్ మైదానం పక్కన నాలుగు అంతస్తుల భవనం పైకి వెళ్లి దూకేసింది. ఆమెను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.36 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు కన్నీరుమున్నీరయ్యారు. సీఎస్ఈ హెడ్ వసుమతి.. ఉత్తమ విద్యార్థి మృతితో బోరుమని విలపించారు. ఒత్తిడితోనే మేఘన ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని ఎస్ హెచ్ఓ కిషన్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


మేఘన ఎంసెట్ లో 200 ర్యాంకు సాధించింది. ఏడాది కాలంగా ఆమె మానసిక చికిత్స తీసుకుంటుందని వైస్ ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. 6 నెలలుగా కుమార్తెను తల్లి కారులో తీసుకొచ్చి దింపి.. తరగతులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి తీసుకెళ్లేదని విద్యార్థులు తెలిపారు. బుధవారం 1.40 వరకు కుమార్తెతోనే ఉండి అన్నం తినిపించిన తల్లి పరీక్ష బాగా రాసి రా అని చెప్పి అటు వెళ్లగానే మొదటి సంవత్సరం తరగతులు జరిగే భవనం పైకి వెళ్లి దూకేసింది. తరగతిలోనూ మేఘన ముభావంగా ఉండేదని, తనకు ఐఐటీలో చదవాలని ఉండేదని ఎప్పుడూ ఆమె చెబుతుండేదని సహచన విద్యార్థులు తెలిపారు.    


నిన్నటికి నిన్న రంగారెడ్డిలో సివిల్స్ అభ్యర్థి..


రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాయల్ విల్లా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 27 ఏళ్ల సివిల్స్ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన 27 ఏళ్ల పూజిత సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. శంషాబాద్ లోని అద్దె గదిలో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె అద్దె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చున్నీతో ఇంట్లోని కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. తీవ్రంగా వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా.. పూజిత చనిపోయి కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ముందుగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడం, తీవ్రంగా వాసన వస్తుంతడటంతో పూజిత కనీసం మూడు రోజుల కిందట చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 


పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న పూజిత తల్లిదండ్రులు.. తమ కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని.. అతనే తమ కూతురు మరణానికి కారణం అంటూ పూజిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు కలెక్టర్ అయి సమాజ సేవ చేస్తుందనుకుంటే.. ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఏంటంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.  ఈ క్రమంలోనే పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.