Mukesh Ambani Reliance Chairman: మార్కెట్ విలువ పరంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ‍‌(Reliance Industries -  RIL) భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీ. ఈ కంపెనీ ఈ స్థాయికి చేరడం వెనుక, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ నాయకత్వ పఠిమ ప్రధాన కారణం. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం, 2022లో, తన తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ పగ్గాలను ముకేష్ అంబానీ అందుకున్నారు. తండ్రి నుంచి వ్యాపార దక్షతను పుణికిపుచ్చుకున్న ముకేష్‌ అంబానీ, మరింత గొప్ప పని చేశారు. తన బాధ్యతలను చాలా అద్భుతంగా నిర్వహించారు. 


20 ఏళ్లలో 20 రెట్ల లాభం
20 ఏళ్ల క్రితం రిలయన్స్‌ రాజ్యానికి రాజైన నాటి నుంచే ముకేష్‌ విజయం మొదలైంది, నేటికీ కొనసాగుతోంది. ముఖేష్ అంబానీ నాయకత్వంలోని గత రెండు దశాబ్దాల్లో.. కంపెనీ ఆదాయం, లాభాలతో పాటు మార్కెట్ విలువ నిరంతర రెండంకెల వృద్ధి రేటును సాధించింది. ఈ కాలంలో కంపెనీ మార్కెట్ విలువ 42 రెట్లు పెరిగింది. ఆదాయాలు 17 రెట్లు, లాభాలు దాదాపు 20 రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో.. పెట్టుబడిదారుల ఆదాయాలు కూడా భారీగా పెరిగాయి. ఏడాదికి రూ.87 వేల కోట్ల చొప్పున, ఈ 20 ఏళ్లలో పెట్టుబడిదారుల జేబుల్లోకి రూ. 17.4 లక్షల కోట్లు చేరాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలు పోటీ పడ్డాయి. ఫేస్‌బుక్, గూగుల్, BP వంటి భారీ కంపెనీలు డబ్బు మూటలతో రిలయన్స్ తలుపు తట్టాయి.


దేశంలోనే అతి పెద్ద కంపెనీ విజయగాథలోని ముఖ్యమైన అధ్యాయాలన్నీ ముఖేష్ అంబానీ చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. చమురుతో ప్రారంభించి, టెలికాం, రిటైల్ పరిశ్రమలో అనేక మైలురాళ్లను కంపెనీ సాధించింది. మొబైల్‌ డేటాను 'న్యూ-ఆయిల్' అని పిలిచిన మొదటి వ్యక్తి ముఖేష్ అంబానీ. దేశంలోని సామాన్యుడి దైనందిన జీవితాన్ని మొబైల్‌ డేటా ఎంతగా మార్చేసిందో అందరికీ తెలిసిందే.


రిలయన్స్ జియో అద్భుత కథ
రిలయన్స్ జియోను మన దేశంలోనే కాక, ప్రపంచంలోనే అతి పెద్ద టెలికాం కంపెనీల్లో ఒకటిగా ముకేష్‌ తీర్చిదిద్దారు. జియో వచ్చిన తర్వాత, డిజిటల్ ప్రపంచంలో భారత దేశం చేసిన పరుగును చూసి ప్రపంచమంతా ముఖేష్ అంబానీ గొప్పదనాన్ని అంగీకరించింది. ఇవాళ, అత్యధిక డిజిటల్ లావాదేవీల రికార్డ్‌ భారతదేశం పేరిట ఉంది. తోపుడు బండి నుంచి 7 నక్షత్రాల హోటల్ వరకు డిజిటల్ చెల్లింపు సౌకర్యం ఉంది. దీని వెనుక ప్రభుత్వ కృషి ఉన్నా, రిలయన్స్ జియోకి కూడా క్రెడిట్‌ వెళుతుంది. ఒకప్పుడు ఒక జీబీ డేటా రూ.250గా ఉంటే, జియో వచ్చిన తర్వాత ఇప్పుడు రూ.10కే అందుబాటులోకి వచ్చింది. డేటా వినియోగంలో... 2016లో 150వ ర్యాంక్‌లో ఉన్న భారతదేశం, అందరినీ ఓడించి ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని సంపాదించుకుంది.


రిటైల్ రంగంలో గ్లోబల్‌ కంపెనీలకూ పోటీ 
రిటైల్ రంగంలోనూ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు రిలయన్స్‌ పోటీ ఇస్తోంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్, రిటైల్ లేదా హోల్‌సేల్.. సెంటర్‌ ఏదైనా ముఖేష్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ప్రతిచోటా తన పట్టును బలోపేతం చేసుకుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వంటి గ్లోబల్‌ కంపెనీలు రిలయన్స్‌ను తమ ప్రత్యర్థిగా భావిస్తున్నాయి. ఆదాయం పరంగా కూడా దేశంలోనే నంబర్ వన్ రిటైల్ కంపెనీగా రిలయన్స్‌ అవతరించింది.


దార్శనికుడైన ముఖేష్ అంబానీ, అలుపు ఎరుగని వ్యాపార యోధుడు. రిలయన్స్‌ బలమైన భవిష్యత్ కోసం ఏళ్ల క్రితం నుంచే పునాదులు పటిష్టం చేస్తూ వచ్చారు. భవిష్యత్‌ ఏ రంగాలదో ముందే పసిగట్టి, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. న్యూ ఎనర్జీ కోసం, 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో జామ్‌నగర్‌లో 5 గిగావాట్ల ఫ్లాంట్లను రిలయన్స్‌ ఏర్పాటు చేస్తోంది. సౌర శక్తి & గ్రీన్ హైడ్రోజన్ వంటి కొత్త ఇంధన వనరులపైనా చురుగ్గా పని చేస్తోంది.