Indian rigin brothers could face 400 years in prison: అమెరికా కలల వెనుక దాగి ఉన్న ఒక భారీ మోసగాళ్ల గుట్టు రట్టయింది. భారత సంతతికి చెందిన ఇద్దరు సోదరులు సృష్టించిన మాయాజాలం, వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇప్పుడు వారిని ఏకంగా 400 ఏళ్ల జైలు శిక్ష ముంగిట నిలబెట్టింది. డెంటల్ సామ్రాజ్యం పేరుతో నేరాల గూడు
వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన భాస్కర్ సవానీ, తన సోదరుడు అరుణ్తో కలిసి అమెరికాలో సవానీ గ్రూప్ పేరుతో దాదాపు 50 డెంటల్ క్లినిక్ల నెట్వర్క్ను నిర్మించారు. బయట ప్రపంచానికి ఇవి సామాన్యులకు వైద్యం అందించే కేంద్రాలుగా కనిపించినా, లోపల మాత్రం డజన్ల కొద్దీ అక్రమాలు సాగుతూ వచ్చాయి. అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థల విచారణలో వీరు పది ఏళ్లపాటు ఒక పక్కా క్రిమినల్ ఎంటర్ప్రైజ్ నడిపినట్లు తేలింది. వీరు కేవలం వైద్యం మాత్రమే కాదు, వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కోట్లు గడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మెడిసిన్ నుండి వీసా వరకు.. అంతా మోసమే!
వీరి మోసాలు ఒక రకమైనవి కావు. అమెరికా ప్రభుత్వం పేదల కోసం అందించే మెడికెయిడ్ పథకంలో ఏకంగా 32 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 260 కోట్లు మేర కుంభకోణానికి పాల్పడ్డారు. ఒకసారి వీరి కాంట్రాక్టులు రద్దయినా, ఇతరుల పేర్లతో బినామీ క్లినిక్లు పెట్టి మరీ నిధులు కాజేశారు. అంతటితో ఆగకుండా, భారత్ నుండి వచ్చే కార్మికుల కోసం వందలాది నకిలీ H-1B వీసా అప్లికేషన్లు సృష్టించారు. వారితో పని చేయించుకుంటూ, వారి జీతాల్లో కమీషన్లు వసూలు చేస్తూ ఆధునిక బానిసత్వాన్ని తలపించేలా వ్యవహరించారు.
మనుషులపై ప్రయోగాలు - అత్యంత భయంకరమైన కోణం
ఈ కేసులో అత్యంత విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. ఎఫ్డిఏ అనుమతి లేని, కేవలం ప్రయోగాలకు మాత్రమే పరిమితమైన డెంటల్ ఇంప్లాంట్లను రోగులకు తెలియకుండానే వారి దవడల్లో అమర్చారు. కేవలం లాభాల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడారు. దీనికి తోడు పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి 42 రకాల నేరారోపణలను ఎదుర్కొన్నారు. వీరు గడించిన డబ్బుతో విలాసవంతమైన విల్లాలు, స్విమ్మింగ్ పూల్స్ నిర్వహణకు అయ్యే ఖర్చులను కూడా కంపెనీ లెక్కల్లోనే చూపించేవారు.
400 ఏళ్ల జైలు శిక్ష ముంగిట..
మార్చిలో జరిగిన విచారణలో జ్యూరీ వీరిని దోషులుగా నిర్ధారించింది. వీరిపై ఉన్న డజన్ల కొద్దీ నేరాల తీవ్రత దృష్ట్యా, భాస్కర్ సవానీకి 420 ఏళ్లు , అరుణ్ సవానీకి 415 ఏళ్ల గరిష్ట జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా న్యాయ చరిత్రలో ఒక వైద్య రంగ నెట్వర్క్ ద్వారా ఇంతటి స్థాయిలో రాకెటీరింగ్ జరగడం అరుదు. జూలైలో వీరికి తుది శిక్ష ఖరారు కానుంది. ఒక గొప్ప వైద్యుడిగా ఎదగాల్సిన వ్యక్తి, తన తెలివితేటలను నేర సామ్రాజ్య విస్తరణకు వాడి ఇప్పుడు కటకటాల వెనక్కి చేరడం చర్చనీయాంశంగా మారింది.
