Student suicide: ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఎంటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం మరువక ముందే మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మెగా కపూర్‌.. ఐఐటీలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు, హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే మెగా కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు వంటి విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


గతనెల 31న ఎంటెక్‌ విద్యార్థి రాహుల్‌ తానుంటున్న హాస్టల్‌ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రాహుల్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


కస్తూర్భా పాఠశాలలో మరో విద్యార్థి మృతి.. 
వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన ఆశ్రమ స్కూల్ ఘటన మరువకముందే.. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ లోని  కస్తూర్భా పాఠశాలలో మరో విద్యార్థిని మృతి చెందింది. ప్రతిరోజూ లాగే మంగళవారం రాత్రి పాఠశాల వసతి గృహంలో భోజనం చేసి పడుకుంది. బుధవారం ఉదయం నోటి నుంచి నురగ రావడంతో..  స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ బాలిక చికిత్స పొందతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు.. ఐశ్వర్య మృతదేహంతో కస్తూర్బా పాఠశాల ముందు ధర్నాకి దిగారు.


మృతదేహంతో ధర్నాకి దిగిన కుటుంబ సభ్యులు.. 
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఐశ్వర్య చనిపోందని ఆరోపిస్తున్నారు. ఐశ్వర్య కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పాల్వాయి హరీష్ బాబు కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. విద్యార్థికి న్యాయం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడరు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.


వినాయక చవితి రోజు ఐఐటీ హైదరాబాద్ లో విషాదం
వినాయక చవితి రోజున హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌లో విషాదం నెలకొంది. ఎంటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్‌లో తన మంచానికి ఉరివేసుకొని కనిపించడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడు సూసైడ్ నోట్‌ లో రాసి ఉన్నప్పటికీ అనుమానాలు తలెత్తాయి. మృతికి సంబంధించిన వివరాలు, కారణాలు, డేటాను ఫోరెన్సిక్, ఐటీ నిపుణులు చెక్ చేస్తున్నారు. రాహుల్ బింగుమల్ల అనే 24 సంవత్సరాల యువకుడు గత బుధవారం క్యాంపస్‌లోని తన రూమ్‌ నెంబర్‌ 107లో విగత జీవిగా కనిపించాడు. ఇతర స్టూడెంట్స్‌ ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సూసైడ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.