IAF Wing Commander commits suicide in Chhattisgarh:  భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఉన్నతాధికారి ఆత్మహత్య  హాట్ టాపిక్ గా మారింది.  ఛత్తీస్‌ఘడ్‌ రాయ్‌పూర్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్న  వింగ్ కమాండర్ విపుల్ యాదవ్ బుధవారం ఉదయం తన అధికారిక నివాసంలో విగతజీవిగా కనిపించారు. విధి నిర్వహణలో ఎంతో ధైర్యవంతుడిగా పేరున్న అధికారి, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తోటి అధికారులను, సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Continues below advertisement

రాయ్‌పూర్‌లోని తేలీబంధా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం విపుల్ యాదవ్ గది తలుపులు తీయకపోవడంతో, ఇంట్లో పనిచేసే వ్యక్తి కిటికీలోంచి చూడగా ఆయన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఆయన భార్య బెంగళూరులో ఉండగా, ఇద్దరు పిల్లలు పక్క గదిలోనే నిద్రిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు.  

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే  కారణమని అనుమానిస్తున్నారు. విపుల్ యాదవ్ భార్య గతంలో వైమానిక దళంలోనే పనిచేశారు, ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నారు. 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, గత కొంతకాలంగా వీరి మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఉన్నాయని, తరచూ గొడవలు జరుగుతుండేవని రాయ్‌పూర్ పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తిగత సమస్యల వల్ల కలిగిన మానసిక ఒత్తిడే ఆయనను ఈ విపరీత నిర్ణయానికి ప్రేరేపించి ఉండవచ్చని ఏసీపీ రమాకాంత్ సాహు పేర్కొన్నారు.                             

నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల వంటి అత్యంత ఒత్తిడితో కూడిన విధుల్లో ఉంటూ, మరోవైపు కుటుంబ పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడం ఆయనను కుంగదీసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సైనిక దళాల్లో అధికారుల మానసిక ఆరోగ్యం మరియు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సరైన వ్యవస్థలు అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.