Hyderabad Wife Suicide: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు సాధారణమే. ఒకరి పనులు మరొకరికి నచ్చకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. చాలా మంది అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని ముందుకు పోతుంటారు. మరీ సున్నిత మనస్తత్వం ఉండే వారు మాత్రం వాటిని తట్టుకోలేక మథనపడిపోతుంటారు. ఇంకొంత మంది అది భరించలేక తనువు చాలించిన వారూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. చాలా చిన్న సమస్యకే భార్య చిన్నబుచ్చుకొని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ప్రాంతంలో బుధవారం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాసరి శ్రుతి, నవీన్ ఇద్దరూ భార్యాభర్తలు. వీరు కూకట్‌ పల్లిలోని న్యూ బాలాజీ నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కాగా, ఒకరికి ఆరేళ్లు మరో ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. నవీన్ ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. శ్రుతి గృహిణిగానే ఉంటోంది. భార్యాభర్తలిద్దరు చాలా అన్యోన్యంగానే ఉండేవారని స్థానికులు తెలిపారు. కానీ మంగళవారం ఓ చిన్నపాటి తగాదా చోటు చేసుకుంది. 


మంగళవారం మధ్యాహ్నం నవీన్ బాత్‌ రూమ్‌కి వెళ్లాడు. మూత్ర విసర్జన చేసి నీళ్లు పోయలేదు. కంపు రావడంతో అదేంటని భార్య నిలదీసింది. నీళ్లు పోయకుంటే చెడ్డ వాసన వస్తోందని.. నీళ్లు పోయాలని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. అది చాలా అవమానంగా భావించిన శ్రుతి తీవ్ర మనస్థాపానికి గురైంది. క్షణికావేశంలో కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడింది. 


కుటుంబం మొత్తం కింది ఫ్లోర్‌లో ఉండగా, ఈమె ఒకతే పై ఫ్లోర్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కాసేపటికి భర్త పైకి వెళ్లగా.. తలుపుకు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపులను బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూస్తే శ్రుతి ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. దీంతో పిల్లలు తమ తల్లి కోసం కంటతడిపెట్టారు. కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.