Hyderabad Accident : కట్టుకున్న వాడైతే ఏంటీ తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అంటుందో ఓ మహిళ. భర్త నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే కొడుకు చనిపోయాడని భార్య కేసు పెట్టింది. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.  అతి వేగంగా కారు నడపడంతో తన కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ ఓ మహిళ శంకరపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసుల సమాచారం మేరకు వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన రహీం, రేష్మా చాలా ఏళ్ల క్రితం పెళ్లైంది. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి పదమూడేళ్ల కుమార్తె ఆశ్యుబేగం, పదేళ్ల కుమారుడు రెహమాన్‌ ఉన్నారు. శుక్రవారం శంకర్‌పల్లిలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి కుటుంబంతో సహా హాజరయ్యారు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే రహీం కారును అతివేగంతో, నిర్లక్ష్యంగా నడపడంతో శంకర్‌పల్లి మండలం కచ్చిరెడ్డిగూడ వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని రెహమాన్‌ అక్కడికక్కడే మరణించాడు. తన కుమారుడి మృతికి భర్త నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమని భార్య రేష్మ పోలీసులను ఆశ్రయించింది. భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఫిర్యాదులో కోరింది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు. కొడుకుని కోల్పోయనన్న బాధతో ఆమె కేసు పెట్టినట్లు పోలీసులు భావిస్తు్న్నారు. 


జనగామ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తవేరా వాహనం రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి దర్గా వద్దకు రాగానే పంక్చర్ అయి ఒక్కసారిగా అదుపుతప్పింది. రహదారిపై 70 మీటర్ల మేర పల్టీలు కొడుతూ వెళ్లిన కారు  డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికీ వేగం అదుపుకాకపోవడంతో డివైడర్‌పైనే వాహనం దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులు రహదారిపై చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపడ్డారు. స్థానికులు సాయంతో అంబులెన్స్‌లో గాయపడిన వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.   


Also Read : Vizianagaram: వర్క్ ఫ్రం హోంలో బిజీగా భర్త, పక్క గదిలో భార్య దారుణం - ఏం చేసిందో తెలుసా?


Also Read : Kakinada: బాలికను లోపలికి రమ్మని ట్యాబ్లెట్లు ఇచ్చిన హాస్టల్ వార్డెన్, కరోనాకు మందు అని మాయమాటలు - చివరికి