విజయనగరం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది. భర్తాభర్తలు ఇద్దరూ ఐటీ ఉద్యోగులు కావడం, వారు సొంతూరులో ఉండి ఇంటి నుంచే పని చేస్తున్న నేపథ్యంలో ఈ ఘోరం జరిగింది. భర్త ఓ గదిలో వర్క్ ఫ్రం హోం చేస్తుండగా, భార్య పక్క గదిలో ఉరి వేసుకుంది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలోని మయూరీ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు.


వివాహిత ఆత్మహత్య చేసుకున్నందుకు గల కారణం అత్తింటి వారి వేధింపులు అని పోలీసులు తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేకే వివాహిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. వివాహిత తరపు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని మయూరి జంక్షన్‌ వద్ద ఉండే నిర్మల అనే 27 ఏళ్ల యువతికి, అదే నగరంలోని స్థానిక బాలాజీ రోడ్డు నటరాజ్‌ కాలనీకి చెందిన భార్గవ్‌ అనే వ్యక్తికి 2020 ఏడాదిలో పెళ్లి జరిగింది. వీరు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యారు.


ఇది ఇలా ఉండగా వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త భార్గవ్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తరచూ నిర్మలను వేధిస్తూ ఉండేవారు. దీంతో ఆమె గతంలో చాలా సార్లు పుట్టింటికి వెళ్లిపోయింది. తాను ఇక కాపురానికి వెళ్లబోనని మొండికేసింది. అయితే, పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతగా బాలేకపోవడంతో నిర్మలకు నచ్చ చెప్పి ఆమె తల్లిదండ్రులు కాపురానికి పంపించారు.


మరోవైపు, అత్తారింటి నుంచి వేధింపులు మరీ తీవ్రం కావడంతో అటు పుట్టింటి వారితో చెప్పుకోలేక, ఇటు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరికి నిర్మల శనివారం తన ఇంటిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, నిర్మల ఆత్మహత్య చేసుకుందా? లేక అత్తింటి వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. చనిపోయిన వివాహిత తండ్రి లక్ష్మణ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాన్ని అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నామని విజయనగరం త్రీటౌన్ పోలీసులు వెల్లడించారు.