హైదరాబాద్‌ నగరంలో ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారయత్నం ఘటన కలకలం రేపుతోంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు లెనిన్‌ నగర్‌లో బాలికను కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్‌ 5వ తేదీన ఈ అత్యాచారయత్న ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధితుల ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం వెతుకుతున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. స్థానిక లెనిన్‌ నగర్‌కు చెందిన బాధితురాలు.. రాత్రి వేళ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆమెను తమ బైక్ ఎక్కించుకున్నారు. బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని బడంగ్‌ పేట్‌లోని గవర్నమెంట్ స్కూల్ వెనక ప్రాంతానికి తీసుకొని వెళ్లారు. అక్కడ లైంగికదాడి యత్నం చేస్తుండగా బాలిక పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.


ఈ అత్యాచార యత్నంలో భాగంగా నిందితులు బాలికను బాగా భయపెట్టారు. తమ గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తామని చెప్పినట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.