Student Suicide:  హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న జాదవ్ సాయి తేజ (22) అనే హుషారైన విద్యార్థి, సీనియర్ విద్యార్థుల రాగింగ్, వేధింపులతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడిపల్లిలోని మధు బాయ్స్ హాస్టల్‌లోని తన గదిలో సాయి తేజ ఉరివేసుకొని ప్రాణాలు వదిలాడు.                         

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి తేజ సెకండ్ ఇయర్ బీటెక్ విద్యార్థి. అతని కుటుంబం, వారి లాయర్   సీనియర్ విద్యార్థులు సాయి తేజను బార్‌కు బలవంతంగా తీసుకెళ్లి శారీరకంగా హింసించారు. అంతేకాక, రూ. 10,000 వారు మద్యం తాగిన బిల్లు చెల్లించమని బెదిరించారని ఆరోపించారు. ఈ వేధింపులతో మానసికంగా కుంగిపోయిన సాయి తేజ, ఆత్మహత్యకు ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో అతను భయంతో సహాయం కోసం వేడుకుంటూ కనిపించాడు. "నేను కళాశాలకు వెళ్తుండగా నలుగురు-ఐదుగురు వచ్చి నన్ను బెదిరించారు. వాళ్లు డబ్బు అడుగుతున్నారు," అని అతను వీడియోలో చెప్పాడు. సీనియర్లు తనను కొట్టి, డబ్బు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.                         

సీనియర్లు సాయి తేజను బార్‌కు తీసుకెళ్లి  మద్యం తాగి బిల్లు చెల్లించమని బలవంతం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. సాయి తేజ తెలివిగల విద్యార్థి అయినప్పటికీ, సీనియర్ల నిరంతర వేధింపులు అతన్ని మానసికంగా కుంగదీశాయని స్నేహితులు చెబుతున్నారు.              

మేడిపల్లి పోలీసులు ఈ ఘటనపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) ,  యాంటీ-ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీనియర్ విద్యార్థులపై విచారణ ప్రారంభించిన పోలీసులు,ర్యాగింగ్, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్ సమస్య తీవ్రతను మరోసారి బయటపెట్టింది. సాయి తేజ కుటుంబం న్యాయం కోసం డిమాండ్ చేస్తూ, దోషులైన సీనియర్లకు కఠిన శిక్ష విధించాలని కోరింది. కళాశాల ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది బయట హాస్టల్‌లో జరిగిన ఘటన కావడంతో ఎలాంటి ప్రకటన చేయలేదు.