Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు

ABP Desam Updated at: 26 May 2022 06:08 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Hyderabad News : సరూర్ నగర్ కుటుంబ ఆత్మహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కాంట్రాక్టర్ రూ.2 కోట్లకు పైగా మోసం చేయడంతో ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటన

NEXT PREV

Hyderabad News :  హైదరాబాద్ సరూర్ నగర్(Saroor Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం(Family Suicide Attempt) సంచలనంగా మారింది. బిల్లుల విషయంలో ఓ కాంట్రాక్టర్ మోసం చేయడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో(Selfie Video)లో బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బంధువుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి సరైన సమయంలో చేరుకోవడంతో ఆ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. సరూర్ నగర్ కుటుంబ ఆత్మహత్యయత్నం బాధితులు శశికుమార్, అతని భార్య శ్వేతా తమ ఆవేదనను అధికారుల‌కు తెలిపారు. దినేష్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. వేధింపులు తట్టుకోలేక పిల్లలతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.



  • రూ. 2 కోట్ల వరకూ చెల్లించాలి


దినేష్ రెడ్డి వద్ద ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్ గా శశికుమార్ పనిచేస్తున్నాడని అతడి భార్య శ్వేత తెలిపారు. 2019 ఫిబ్రవరి నెల నుంచి దినేష్ రెడ్డి డబ్బులు ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు చెల్లించాలన్నారు. డబ్బులు ఇవ్వమని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. చనిపోయే ముందు కూడా డబ్బులు ఇవ్వమని కోరినా చస్తే చావండని అన్నాడని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలతో సహా నిద్ర మాత్రలు వేసుకున్నామన్నారు. దినేష్ రెడ్డి నుంచి తమకు న్యాయంగా రావాల్సిన నగదు ఇప్పించాలని ఆమె వేడుకున్నారు. 



విటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి అని మాకు 2 టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వేసుకోగానే చేదుగా ఉండడంతో వాంతులు చేసుకున్నాం. మేము ఆడుకునేందుకు హోటల్ కిందకి వెళ్లి వచ్చే లోపు అమ్మ, నాన్న బెడ్ పైన పడి ఉన్నారు. మాకు దినేష్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి. మా నాన్న అడుగుతుంటే బూతులు తిడుతున్నారు. మాకు న్యాయం చెయ్యండి. - శశికుమార్ పిల్లలు



  • రాజకీయ పలుకుబడితో


దినేష్ రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుండి తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడని శశికుమార్ బావమరిది సురేష్ తెలిపారు. డబ్బులు అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తన బావ వాళ్లు చివరిగా అడిగినా ఏమైనా చేసుకోండి అని మాట్లాడాడన్నారు. అతని వెనుక రాజకీయ పలుకుబడి ఉందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. బావ వాళ్లు ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించారన్నారు. ఇలా మళ్లీ ఆత్మహత్యకు పాల్పడితే ఎవరు బాధ్యులు అన్నారు. వెంటనే దినేష్ రెడ్డి తమ డబ్బు తమకు ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేశారు. 

Published at: 26 May 2022 06:08 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.