25 Tonnes Fake Spices Seized Hyderabad:  భాగ్యనగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ విషపూరితమైన రసాయనాలతో నకిలీ, కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న భయంకరమైన కల్తీ మాఫియా ముఠా గుట్టును హైదరాబాద్ నగర పోలీసులు మంగళవారం రట్టు చేశారు. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం సహా నగరవ్యాప్తంగా ఉన్న 13 మసాలా వ్యాపార కేంద్రాలపై హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్  అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 25 టన్నుల కల్తీ మసాలా దినుసులతో పాటు, తయారీకి సిద్ధంగా ఉంచిన మరో 89 టన్నుల కల్తీ నిల్వలను సీజ్ చేశారు. ఈ దందాతో సంబంధం ఉన్న ముగ్గురు నిర్వహకులను అరెస్ట్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Continues below advertisement

పోలీసులు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం నిత్యం వంటల్లో వాడే జీలకర్ర, లవంగాలు, షాజీరా, వాము, ఆవాలు, మెంతులు, సోంపు వంటి నకిలీ దినుసులకు ఆకర్షణీయమైన రంగు, మెరుపు తీసుకురావడానికి నిందితులు దారుణమైన పద్ధతులు ఉపయోగించారు. ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్స్ ,  అత్యంత ప్రమాదకరమైన హెయిర్ కలర్  రసాయనాలను కూడా మసాలాల్లో కలిపి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

దాడుల వివరాలను నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. పారిశ్రామిక రంగులు, రసాయనాలతో తయారు చేసిన ఇటువంటి కల్తీ మసాలా పదార్థాలు తినడం వల్ల ప్రజల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు మరియు తీవ్రమైన అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇటువంటి కల్తీదారులపై ఆహార భద్రతా చట్టంతో పాటు కఠినమైన క్రిమినల్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు.

Continues below advertisement

విషపూరితమైన పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి నమూనాలను సమగ్ర విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించారు. హెచ్-ఫాస్ట్ రూపుదిద్దుకున్న 140 రోజుల్లోనే ఇప్పటివరకు 659 ప్రాంతాల్లో దాడులు జరిపి, 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ వివరించారు. నగరంలోని హోటళ్లు, హాస్టళ్లు, హోల్‌సేల్ మార్కెట్లలో కల్తీ ఉత్పత్తుల నిరోధానికి టాస్క్‌ఫోర్స్, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా విభాగంతో కలిపి తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.   

మరోవైపు ప్రజలు కూడా ప్యాకేజ్డ్,  కల్తీ మసాలా పదార్థాల కొనుగోలు విషయంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా నకిలీ ఆహార పదార్థాలు లేదా కల్తీ తయారీ కేంద్రాలు పనిచేస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్ నంబర్ 8712661212  కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కల్తీ రహిత హైదరాబాద్ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పోలీస్ యంత్రాంగం పేర్కొంది.